. బీజింగ్ రక్షణ మంత్రితో భేటీలో ప్రతిపాదించిన రాజ్నాథ్ సింగ్
. సానుకూల దృక్పథంతో ముందుకెళ్లాలని ఇద్దరు నేతల నిర్ణయం
న్యూదిల్లీ : తమ దేశాల మధ్య సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడం కోసం సానుకూల దృక్పధంతో ముందుకెళ్లాలని చైనా, భారత్ రక్షణ మంత్రులు డాంగ్ జున్, రాజ్నాథ్ సింగ్ నిర్ణయించారు. చైనా పర్యటనలో భాగంగా అడ్మిరల్ డాంగ్ జున్తో రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల, వివాదాల పరిష్కారం, కొత్త సమస్యలు రాకుండా చర్యలపై చర్చించారు. ఉద్రిక్తతల పరిష్కారానికి నాలుగు అంశాల ప్రణాళిక (4`పాయింట్ ఫార్ములా)ను ప్రతిపాదించారు. బలగాల ఉపసంహరణ ప్రక్రియను పూర్తిగా పాటించాలని, సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నించాలని, సరిహద్దుల గుర్తింపు, సరిహద్దు వివాదాన్ని పరిష్కరించే ప్రక్రియను వేగవంతం చేయాలని, సంబంధాలు మెరుగుపర్చుకోవడం, విభేదాలను తొలగించడం కోసం కొత్త పద్ధతలు అనుసరించాలని, ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్యల యంత్రాంగాన్ని కొనసాగించాలని రాజ్నాథ్ సింగ్ సూచించారు.
ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళదామన్నారు. అలాగే, పాకిస్థాన్ ప్రేరేపించిన సీమాంతర ఉగ్రవాదం, భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ను వివరించారు. కైలాస మానస సరోవర్ యాత్రను ఆరేళ్ల తర్వాత పున:ప్రారంభించడంపై ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తంచేశారు. చైనా మంత్రికి ప్రసిద్ధ మదుబనీ పెయింటింగ్ను కానుకగా ఇచ్చారు. ఈ భేటీకి సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమంలో పంచుకున్న రాజ్నాథ్… తమ సమావేశం స్నేహపూర్వకంగా, ఫలప్రదంగా సాగిందని పేర్కొన్నారు.
చైనాలోని క్వింగ్డావోలో జరిగిన షాంఘై సహకార సంస్థ’ (ఎస్సీఓ) సభ్యదేశాల రక్షణ మంత్రుల సదస్సులో పాల్గొనడాన్ని ప్రస్తావించారు. చైనా రక్షణ మంత్రి డోంగ్ జున్తో నిర్మాణాత్మక చర్చలు జరిపినట్లు రాజ్నాథ్ సింగ్ వెల్లడిరచారు. ఇదిలావుంటే, ఎస్సీఓ సదస్సులో భాగంగా జాయింట్ స్టేట్మెంట్పై సంతకం చేసేందుకు భారత్ నిరాకరించింది. ఆ పత్రంలో పాకిస్థాన్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం, పహల్గామ్ ఉగ్ర దాడి) వంటి అంశాలు ప్రస్తావించకపోవడంపై అభ్యంతరం తెలిపింది.


