ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ వ్యవస్థ శుక్రవారం నాటికి మరింత బలపడే సూచనలుండగా,క్రమంగా పశ్చిమ.. వాయవ్య దిశగా కదిలి, పశ్చిమ బెంగాల్.. ఉత్తర ఒడిశా తీరాల వైపు కదలే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రాంతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో,ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
ఇందులో భాగంగా, శ్రీకాకుళం,పార్వతీపురం మన్యం,అల్లూరి సీతారామరాజు,అనకాపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే విశాఖపట్టణం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
శనివారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని అంచనా. శని, ఆదివారాల్లో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.శనివారం,ఆదివారం రోజులలో కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.


