వైస్ చైర్మన్గా రాఘవేంద్రరావు
విశాలాంధ్ర- విశాఖ : సహకార రంగంలో విశాఖకు మంచి గుర్తింపు తెచ్చిన 110 సంవత్సరాల విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా జేవీ సత్యనారాయణ మూర్తి, వైస్-చైర్మన్గా సీహెచ్ రాఘవేంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేశంలో 1472 సహకార అర్బన్ బ్యాంకులు ఉండగా… దక్షిణభారతదేశంలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు అతిపెద్దది. ఆర్థిక కార్యకలాపాల రీత్యా మొదటి 10-15 స్థానాలలో నిలిచింది. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ నగరంలోనూ బ్రాంచిలు కలిగి ఉండడంతో బహుళ రాష్ట్రాల సహకార బ్యాంకుగా మార్పు చెంది… రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు సహకార సేవలు అందిస్తున్నది. 1.12 లక్షల మంది షేరుహోల్డర్లతో రూ.400 కోట్ల షేరుధనం కలిగి ఉంది. ఎటువంటి వివాదాలకు అవకాశం లేకుండా పాలకవర్గ ఎన్నికలు మూడు దశాబ్దాలుగా ఏకగ్రీవంగా జరగడం బ్యాంకు ప్రత్యేకత. రాజ్యాంగానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నియమించిన సహకార ఎన్నికల అథారిటీ విశాఖ జిల్లా కలెక్టర్ను ఎన్నికల అధికారిగా నియమించడంతో జూన్ 16న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ నోటిఫికేషన్ అనుసరించి సహకార శాఖ అధికారుల ద్వారా నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అన్ని కేటగిరీలకు సంబంధించి 21 మంది మాత్రమే పోటీలో ఉండడంతో వారంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జులై 25న ప్రకటించారు. చైర్మన్, వైస్-చైర్మన్ ఎన్నికను మంగళవారం నిర్వహించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని, డైరెక్టర్లను మాజీ చైర్మన్ మానం ఆంజనేయులు, ఉద్యోగుల సంఘం ప్రతినిధులు అభినందించారు. తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్న డైరెక్టర్లకు చైర్మన్, వైస్ చైర్మన్లు ధన్యవాదాలు తెలియజేశారు. బ్యాంకు డైరెక్టర్లు: జేవీ సత్యనారాయణమూర్తి, సీహెచ్ రాఘవేంద్రరావు, సూర్పనేని నాగభూషణ చౌదరి, ఏజే స్టాలిన్, వీరఘంట చంద్రశేఖర్, గుళ్లపల్లి జనార్దనరావు, చెరువు ఆదినారాయణ శాస్త్రి, కండాపు ప్రసాదరావు, ఉప్పలపాటి పార్వతీ దేవి, చిన్నం కోటేశ్వరరావు, పాల్యం నారాయణ స్వామి, చెలికాని కృష్ణమోహనరావు, ఆచాళ్ల రామకృష్ణారావు, ఈమని అవని, చుక్కపల్లి రామారావు, నన్నపనేని అంజయ్య, పులిగెడ్డ వెంకట నరసింహమూర్తి, జొన్నలగడ్డ ప్రసాద్ , పిడికిటి మల్లికార్జునరావు, కోగంటి శ్రీకాంత్ బాబు, కేసరి నిర్మల బ్యాంక్ డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు.


