కొవిడ్ వ్యాక్సినేషన్లో తెలంగాణ మరో మైలు రాయిని చేరుకున్నది. రాష్ట్రంలో కొవిడ్ వాక్సినేషన్ నేటితో 5 కోట్ల డోసులను అధిగమించింది. వైద్యసిబ్బంది కేవలం 35 రోజుల్లోనే కోటి టీకాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో గురువారం నాటికి మొదటి డోస్ 2.93 కోట్లు, రెండో డోస్ 2.06 కోట్లు, ప్రికాషన్ డోస్ లేదా బూస్టర్ డోస్ 1.13 లక్షల డోసులు పంపిణీ చేశారు. 15 -17 ఏండ్ల వారికి 8.67 లక్షల డోసులు (47 శాతం) వేశారు. మొదటి డోస్ లక్ష్యానికి మించి దాదాపు 103 శాతం మందికి పంపిణీ చేయగా, రెండో డోస్ 74 శాతం మందికి వేశారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో నిరంతరం కృషి చేస్తున్న వైద్యారోగ్య సిబ్బందితోపాటు పంచాయతీ, మున్సిపల్, ఇతర శాఖల సిబ్బందికి మంత్రి హరీష్ రావు అభినందనలు తెలిపారు.. వైద్యసిబ్బంది కృషితో ఇప్పటికే వ్యాక్సినేషన్ మొదటి డోస్ 100 శాతం పూర్తి చేసుకున్న తొలి పెద్ద రాష్ట్రంగా తెలంగాణ రికార్డు నెలకొల్పిన విషయాన్ని గుర్తు చేశారు. టీకాలు, కొవిడ్ జాగ్రత్తలు మాత్రమే మనల్ని కరోనా బారి నుంచి కాపాడుతాయని ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ రెండు డోసుల వాక్సినేషన్ తప్పనిసరిగా పూర్తి చేసుకొని, మీ కుటుంబాన్ని,సమాజాన్ని కరోనా నుండి సంరక్షించండని ఆయన కోరారు.