బషీర్బాగ్ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమం ఉదృతం..
చార్జీలు, స్మార్టు మీటర్లు బిగింపుపై ప్రభుత్వాన్ని నిలదిద్దాం….వామపక్ష పార్టీ నేతలు పిలుపు...
విశాలాంధ్రవిజయవాడ: విద్యుత్ సంస్కరణల పేరుతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బషీర్బాగ్ ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలని వామపక్ష పార్టీ నేతలు పిలుపునిచ్చారు. 2000సంవత్సరంలో విద్యుత్ ఉద్యమం పోరులో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తూటాలకు బలిjైున బషీర్బాగ్ ముగ్గురు అమరవీరులకు సీపీఐ, సీపీయం వామపక్షపార్టీల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం లెనిన్ సెంటర్ వద్ద శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో కే రామకృష్ణ, పార్టీ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ జల్లి విల్సన్, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, విశాలాంధ్ర విజ్ఞానసమితి ఎజీయం మనోహర్నాయుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు సీహెచ్ బాబురావు, సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తదితర వామపక్షపార్టీ నాయకులు విద్యుత ఉద్యమ అమవీరులు రామకృష్ణ, విష్ణువర్ధన్రెడ్డి, బాలస్వామి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి ఆలపించిన విప్లవ గేయాలు, విద్యుత్ భూతం కళారూపకం వీక్షకులను నాటి ఉద్యమ స్ఫూర్తిని గుండెల్లో నింపాయి. విద్యుత్ సంస్కరణల పేరుతో మరో దోపడికి పాల్పడుతున్న కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిజ్ఞ చేసి, చంద్రబాబు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై , విద్యుత్ అదనపు చార్జీలు పేరుతో ప్రజలపై వేల కోట్లు భారాన్ని మోపడాన్ని వామపక్ష పార్టీ నేతలు తప్పు పట్టారు. అనంతరం దోనేపూడి శంకర్, జి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలు పెంచబోమని, స్మార్టుమీటర్లను పగలుగొట్టండని పెద్ద ఎత్తున ప్రచారం చేసి, అధికారంలో వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు.అదానీతో చేసుకున్న స్మార్టుమీటర్ల ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని లేదంటే అన్ని పక్షాలను కలుపుకుని తీవ్రస్ధాయిలో ఉద్యమానికి శ్రీకారం చుడతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులతో పాటు, సీపీఐ నగర సమితి నగర నాయకులు, ప్రజానాట్య మండలి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


