ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బర్స్ కారణంగా విపరీత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
డెహ్రాడూన్లో మంగళవారం తెల్లవారుజామున వచ్చిన క్లౌడ్ బర్స్ కారణంగా భారీ వరదలు ముంచెత్తాయి.
ఈ వరదల కారణంగా కార్లు,దుకాణాలు కుప్పకూలిపోయాయి.అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి.
అలాగే,ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా వరదలు ముంచెత్తికొచ్చినట్లు అధికారులు తెలిపారు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు వెల్లడించారు.
గల్లంతైన ఇద్దరి వ్యక్తుల కోసం సహాయ చర్యలు జారుస్తున్నట్లు పేర్కొన్నారు.
సంఘటనాస్థలికి జిల్లా మేజిస్ట్రేట్ సివాన్ బన్సాల్, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ కుంకుమ్ జోషి, ఇతర అధికారులు చేరి నష్టాన్ని అంచనా వేస్తున్నారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్,ఎస్డీఆర్ఎఫ్, పీడబ్ల్యూడీ అధికారులు బుల్డోజర్లతో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలను నిర్వహిస్తున్నారు. భారీ వర్షం కారణంగా డెహ్రాడూన్లోని 1-12తరగతుల వరకు అన్ని పాఠశాలలను మూసివేయాలని జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వర్షాలు,కొండచరియల విరిగిపడడం వల్ల ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉత్తరకాశీ పరిధిలోని ధరాలి-హర్సిల్,చమోలి జిల్లా తరాలి,రుద్రప్రయాగ్ జిల్లా చెనాగడ్,పౌరి జిల్లా సైన్జీ,బాగేశ్వర్ జిల్లా కాప్కోట్,నైనిటాల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం,ఏప్రిల్ నెల నుండి ఉత్తరాఖండ్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల 85 మంది మరణించారు,128మంది గాయపడ్డారు,94మంది వ్యక్తులు తప్పిపోయారు. ఇక సెప్టెంబర్ 11న ప్రధాని నరేంద్ర మోదీ విపత్తు ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు.డెహ్రాడూన్ పర్యటనలో రూ.1,200కోట్ల ఆర్థిక సహాయ ప్యాకేజీని ప్రకటించారు.


