— పర్యావరణ పరిరక్షణపై కలెక్టర్ పిలుపు
విశాలాంధ్ర – కడియం : విశాఖపట్నంలో నవంబర్ 14 మరియు 15 తేదీలలో జరగబోయే భాగస్వామ్య పారిశ్రామిక సదస్సు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక వాడల్లో స్వచ్ఛత, పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. గురువారం సాయంత్రం ధవళేశ్వరం ఇండస్ట్రియల్ ఏరియాలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, అక్టోబర్ 15 నుంచి నాలుగు వారాలపాటు పారిశ్రామిక వాడల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటి వారం పారిశుధ్య కార్యక్రమాలు, రెండవ వారం పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ప్రతి పరిశ్రమ, పారిశ్రామిక వాడ పరిసరాల్లో పచ్చదనం పెంపొందిం చడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం అయ్యే దిశలో సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయాలని, స్వచ్ఛందంగా ముందుకు రావాలని ప్రజలను కోరారు. “పర్యావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా పరిశ్రమలు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. పర్యావరణాన్ని కాపాడడం ద్వారా కార్మికుల ఆరోగ్య భద్రతను నిర్ధారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ బి రమణ రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలలో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, విశాఖపట్నం సదస్సు నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధవళేశ్వరం ఎస్టేట్ అధ్యక్షులు మార్ని వాసుదేవ్, ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, జోనల్ మేనేజర్ ఆదిరెడ్డి రమణా రెడ్డి, డీఐసీ జనరల్ మేనేజర్ వానిధర్ రామన్, ఏపీఐఐసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ బి. రాధా మూర్తి, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవ రావు, పలువురు అధికారులు సూర్య ప్రకాష్, భాస్కర్ , ప్రభాకర్, శ్రీహరి , పారిశ్రామిక వేత్తలు ఏ శ్యామ్ సుందర్, తదితరులు పాల్గొన్నారు.


