సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్న యువతికి అరుదైన చికిత్స
— ప్రముఖ హీమటాలజిస్టు డా. కరుణ కుమార్
విశాలాంధ్ర – రాజమండ్రి సిటి : సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్న 22 ఏళ్ల యువతికి సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్ లో మెచ్డ్ సిబ్లింగ్ ఆలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రముఖ హీమటాలజీ, బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ డాక్టర్ కె.కరుణ కుమార్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం స్థానిక యశోద ఆసుపత్రిలో గురువారం జరిగిన మీడియా సమయంలో ఆయన మాట్లాడుతూ, “ రోగి సోదరుడు స్టెమ్ సెల్ దాతగా నిలిచారని, అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో, అనుభవజ్ఞులైన వైద్య బృందం పర్యవేక్షణలో ఈ క్లిష్టమైన వైద్య ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసామన్నారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుంటూ సాధారణ జీవనశైలిలోకి అడుగుపెడుతున్నారని. మూడు నెలల తరువాత కూడా రోగి ఆరోగ్యం స్థిరంగా ఉందన్నారు. “సికిల్ సెల్ వ్యాధి రక్తంలోని హీమోగ్లోబిన్లో జరిగే జన్యుపరమైన మార్పుల వల్ల ఏర్పడే తీవ్రమైన రక్త సంబంధిత వ్యాధి. దీని వల్ల రక్తకణాలు ఆకారంలో మార్పు చెంది, శరీరంలో తగినంత ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుందని, దీర్ఘకాలంలో అవయవ నష్టం, జ్వరం, ఎముకలు నొప్పులు వంటి తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్టెమ్ సెల్ లేదా బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ అత్యంత ప్రభావవంతమైన మరియు శాశ్వత పరిష్కారమని, సరైన సమయంలో చికిత్స చేయడం ద్వారా రోగులు పూర్తిగా కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. విజయవంతమైన వైద్య ప్రక్రియ యశోదా హాస్పిటల్స్లో లభ్యమయ్యే ఆధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్యులు, సాంకేతిక సిబ్బంది, మరియు రోగి సంరక్షణలో ఉన్న నిబద్ధత వలన సాధ్యమైందని. ఇటువంటి విజయాలు రోగులకు కొత్త జీవం, కుటుంబాలకు కొత్త ఆశ అందిస్తున్నాయన్నారు. ఈ మీడియా సమావేశంలో డాక్టర్ కె.కరుణ కుమార్ తోపాటు ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ నల్లం బాల వీరబద్ర, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


