ఓటేసిన ప్రధాని మోదీ
దేశ తదుపరి రాష్ట్రపతి ఎన్నికకు సోమవారం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు ఓటింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఆనవాయితీ ప్రకారం పార్లమెంట్ భవనంలో ఎంపీలు, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.పార్లమెంట్ ప్రాంగణంలో ఓటింగ్ ప్రారంభమైన వెంటనే ప్రధాని మోదీ తన ఓటు వేశారు. ఆ తర్వాత పలువురు కేంద్రమంత్రులు, ఎంపిలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. యూపీ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి, గుజరాత్లోని గాంధీనగర్లో సీఎం భూపేంద్ర పటేల్, చెన్నైలో తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్, ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్లు ఓటు వేశారు. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ కూడా తన ఓటుహక్కుని వినియోగించుకున్నారు.రహస్య బ్యాలెట్ ఓటింగ్ విధానంలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్లో ఎలక్టోరల్ కాలేజీ సభ్యులంతా ఎన్నికల సిబ్బంది ఇచ్చే ప్రత్యేక పెన్నుతోనే ఓటు వేయాలి. బ్యాలెట్ పత్రం ఆధారంగా జరిగే ఈ ఎన్నికలో వరుస క్రమంలో ద్రౌపదీ ముర్ము, యశ్వంత్ సిన్హా పేర్లు ఉండనున్నాయి. ఓటర్లు తాము ఓటు వేయదలచుకున్న అభ్యర్థి పక్కన ప్రాధాన్య సంఖ్యను అంకెల రూపంలో వేయాల్సి ఉంటుంది.