మధ్యప్రదేశ్లో నర్మదా నదిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. జబల్పూర్లోని బార్గీ డ్యామ్లో పర్యాటకులతో వెళ్తున్న ఒక క్రూయిజ్ బోటు మునిగిపోయింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మరణించగా, పలువురు గల్లంతయ్యారు. ఆనందంగా సాగాల్సిన విహారయాత్ర ఈ ఘటనతో క్షణాల్లో పెను విషాదంగా మారింది. మధ్యప్రదేశ్ పర్యాటక శాఖకు చెందిన ఈ క్రూయిజ్ బోటులో ప్రమాద సమయంలో 29 మంది పర్యాటకులు ఉన్నారు. జబల్పూర్లోని ఖమారియా ద్వీపం సమీపంలోకి రాగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన గాలులతో కూడిన తుఫాను రావడంతో బోటు అదుపుతప్పి నీటిలో మునిగిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే 15 మంది పర్యాటకులు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర విపత్తు స్పందన దళం బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇప్పటివరకు ఇద్దరు మహిళలతో సహా ఏడుగురి మృతదేహాలను వెలికితీశారు. మరో 8 మంది ఆచూకీ లభించకపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. బోటు కెప్టెన్ లైఫ్ జాకెట్ ధరించి ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. చీకటి పడటంతో సెర్చ్లైట్ల వెలుగులో రాత్రంతా గాలింపు కొనసాగించారు.
ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, పీడబ్ల్యూడీ మంత్రి రాకేష్ సింగ్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ,”SDRF” బృందాలు సుమారు 10 మందిని కాపాడాయి. క్రూయిజ్ కంపెనీ తప్పు ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం మా ప్రాధాన్యత సహాయక చర్యలకే అని తెలిపారు. గాయపడిన వారిని జబల్పూర్ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ రాఘవేంద్ర సింగ్, ఎస్పీ సంపత్ ఉపాధ్యాయ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.


