కోల్కతా: బెంగాల్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 15 ఏళ్ల మమత పాలనకు అంతం పలికింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు వేళ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి కీలక నిర్ణయం తీసుకున్నారు. మమత కేబినెట్ను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చారు. మోసపూరితంగా ఓట్లు కొల్లగొట్టారని, ఓటమిని అంగీకరించబోమని, రాజీనామా ప్రసక్తే లేదని సీఎం మమతా బెనర్జీ తేల్చిచెప్పినప్పటికీ గవర్నర్ ఆమె ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది. మమతా బెనర్జీ తన శక్తి మేరకు ఎన్నికల మోసాలను అడ్డుకునేందుకు ప్రయత్నించ డంతో ప్రతిపక్ష పార్టీలు ఆమెకు అండగా నిలిచాయి. రాజీనామా చేయనన్న మమత నిర్ణయానికి మద్దతిచ్చారు. మీరు ఓడిపోలేదంటూ సంఘీభావం తెలిపాయి. బీజేపీ ఓట్ల దొంగ అంటూ దుయ్యబట్టాయి. రాష్ట్రంలో బీజేపీ కొత్త ప్రభుత్వం శనివారం కొలువుదీరనున్నది. శాసన సభాపక్షనేతను ఆ పార్టీ శుక్రవారం ఎన్నుకోనుంది. ఈ నేపథ్యంలో మమత ప్రభుత్వాన్ని గవర్నర్ బర్తరఫ్ చేశారు. కాల పరిమితి ముగియడంతో శాసనసభను రద్దు చేశారు. అయితే ఓటమి అంగీకరించని తృణమÖల్ కాంగ్రెస్ తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కోర్టులో సవాల్ చేస్తామని, న్యాయ పోరాటానికి సిద్ధమని ప్రకటించింది. ఇదిలావుంటే, రాజ్యాంగంలోని 174 ఆర్టికల్ క్లాజ్ 2 సబ్క్లాజ్ బీ ప్రకారం అసెంబ్లీ రద్దునకు గవర్నర్ ఆదేశాలిచ్చినట్లు అధికారిక ప్రకటన పేర్కొంది. 293 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 207 సీట్లను బీజేపీ గెలుచుకుంది. రాష్ట్రంలో తొలిసారి అధికారం చేపట్టబోతోంది.


