Homeఅంతర్జాతీయంచైనాకు షాక్ ఇచ్చిన భారత్.. ఆర్చరీ వరల్డ్ కప్‌లో మహిళల జట్టుకు స్వర్ణం

చైనాకు షాక్ ఇచ్చిన భారత్.. ఆర్చరీ వరల్డ్ కప్‌లో మహిళల జట్టుకు స్వర్ణం

- Advertisement -

చైనాలోని షాంఘైలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ (Archery World Cup 2026) రెండవ దశలో భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దీపికా కుమారి, అంకిత భకత్, కుంకుమ్ మొహోద్ సభ్యులుగా ఉన్న భారత జట్టు ఫైనల్లో ఆతిథ్య చైనా జట్టును ఉత్కంఠభరిత షూట్-ఆఫ్‌లో 5-4 తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. నాలుగు సెట్ల ముగిసే సమయానికి ఇరు జట్లు 4-4తో సమంగా నిలవడంతో మ్యాచ్ షూట్-ఆఫ్‌కు వెళ్లింది. కీలక సమయంలో ఒత్తిడిని అధిగమించిన భారత ఆర్చర్లు అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్‌ను సాధించారు.

ఈ విజయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే.. సెమీఫైనల్లో భారత జట్టు 10 సార్లు ఒలింపిక్ ఛాంపియన్ అయిన దక్షిణ కొరియాను ఓడించడం. అలాగే 2021 తర్వాత మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి వరల్డ్ కప్ స్వర్ణ పతకం. మూడు సంవత్సరాల తర్వాత ఈ విభాగంలో భారత్‌కు వచ్చిన తొలి పతకం కూడా ఇదే కావడం విశేషం. అనుభవజ్ఞురాలైన దీపికా కుమారి ఈ టోర్నీలో కీలక పాత్ర పోషించింది. పూర్తి స్థాయి జాతీయ కోచ్ లేకుండానే పోటీలకు వెళ్లిన భారత జట్టుకు ఆమె నిరంతరం మార్గనిర్దేశనం చేస్తూ యువ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.

మ్యాచ్ ఆరంభంలో భారత్ 54-53తో తొలి సెట్‌ను గెలిచి ఆధిక్యం సాధించింది. ఈ సెట్లో దీపికా వరుసగా 10 పాయింట్లు సాధిస్తూ జట్టుకు మంచి లీడ్ అందించింది. అయితే రెండో సెట్లో భారత్ తడబడింది. కుంకుమ్ ఒక బాణంలో 8 మాత్రమే సాధించగా, దీపికా చివరి బాణంలో 7 కొట్టింది. దీంతో చైనా స్కోరును 2-2తో సమం చేసింది. మూడో సెట్లో చైనా పూర్తిగా ఆధిపత్యం చాటింది. వారి చివరి బాణాన్ని రివ్యూలో 8 నుంచి 9గా అప్‌గ్రేడ్ చేయడంతో చైనా 4-2 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ దశలో భారత్ ఓటమి అంచున కనిపించింది. అయితే నాలుగో సెట్లో దీపికా మళ్లీ తన అసలైన ఫామ్‌ను చూపించింది.

చిరస్మరణీయ విజయాన్ని అందించిన దీపికా కుమారి
రెండు పర్ఫెక్ట్ 10లతో భారత్‌ను తిరిగి పోటీలో నిలబెట్టింది. మ్యాచ్‌ను గెలవడానికి చైనాకు చివరి బాణంలో 9 పాయింట్లు మాత్రమే అవసరమయ్యాయి. కానీ తీవ్ర ఒత్తిడిలో చైనా ఆర్చర్ యూ కీ 8 మాత్రమే సాధించడంతో మ్యాచ్ షూట్-ఆఫ్‌కు వెళ్లింది.షూట్-ఆఫ్‌లో భారత ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. అంకిత భకత్ 9తో ప్రారంభించగా, కుంకుమ్ మొహోద్ అద్భుతంగా 10 సాధించింది. చివరగా భారత్‌కు గోల్డ్ ఖాయం కావాలంటే 8 పాయింట్లు అవసరమైన సమయంలో దీపికా కుమారి 9 కొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు