Homeతెలంగాణతెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన..

తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన..

- Advertisement -

పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణలో వాతావరణం విచిత్రంగా మారింది. ఒకవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండగా, మరోవైపు తీవ్రమైన వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాబోయే రెండు రోజుల పాటు (శని, ఆదివారాలు) రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాబోయే 48 గంటలు అత్యంత కీలకమని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపారు.

గడిచిన 24 గంటల్లో నల్గొండ జిల్లావ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పెద్దవూర మండలం పులిచెర్లలో అత్యధికంగా 11.2 సెం.మీ.ల వర్షం కురవగా, పలు మండలాల్లో చెరువులను తలపించేలా నీరు చేరింది. మరోవైపు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. చందానగర్, మియాపూర్, కేపీహెచ్‌బీ, అమీర్‌పేట, జూబ్లీహిల్స్, కోఠి వంటి అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులతో కురిసిన వానకు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.

ఓవైపు భారీ వర్షాలు.. మరోవైపు భగ్గుమంటున్న ఎండలు!
ఒకవైపు వర్షాలు ఊరటనిస్తున్నా, మరోవైపు ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. శుక్రవారం రాష్ట్రంలోని 16 జిల్లాల పరిధిలోని 63 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచాయి. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 42.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ‌ ఉష్ణోగ్రత నమోదైంది. మరో 22 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగానే కొనసాగాయి. రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడుతుందని ఆశించిన ప్రజలకు, ఒకేసారి వర్షాలు, వడగాల్పులు, ఉక్కపోత అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడరాదని అధికారులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు