అమెరికకు ఇరాన్ హెచ్చరిక
తెహాన్: ఒక వైపు అమెరికా`ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతుండగా ఇజ్రాయిల్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు అగ్గి రాజేసినట్లయింది. ఇజ్రాయిల్ రక్షణ మంత్రి కాట్జ్ ఇటీవల…ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మరణ శిక్షకు అర్హుడని, అణ్వాయుధాల్ని అభివృద్ధి చేసేందుకు తెహ్రాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని కాట్జ్ వ్యాఖ్యానించడం రెండు దేశాల మధ్య మళ్లీ వివాదాన్ని రాజేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ మరోసారి అమెరికా, ఇజ్రాయెల్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. కాట్జ్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ ఘాటుగా స్పందించారు. అమెరికా తాను పెంచి పోషిస్తున్న, తన పెంపుడు శక్తి అయిన ఇజ్రాయిల్ను అదుపులో పెట్టుకోవాలని స్పష్టం చేశారు. లేదంటే ఇరాన్ నుంచి గట్టిగా ప్రతిస్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. పశ్చిమాసియాలో ఘర్షణలకు ముగింపు పలికేందుకు కుదిరిన 14 అంశాల అవగాహనా ఒప్పందం (ఎంఓయమూ) ప్రకారం ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత అమెరికాపైనే ఉందన్నారు. ఇజ్రాయిల్ చర్యల్ని నియంత్రించడం ఇందులో భాగమేనని పేర్కొన్నారు. ఒకవేళ అమెరికా మాట వినకపోతే ఇరానే ఇజ్రాయిల్కు తగిన బుద్ధి చెబుతుందని అరాగ్చీ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు.
దోహా చర్చలకు అమెరికా ప్రతినిధులు గైరుహాజరు…
దోహలో జరుగుతున్న చర్చలకు అమెరికా ప్రతినిధులు డుమ్మా కొట్టారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం…ఖతార్, పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో ఖతార్ రాజధాని దోహాలో ఇరు దేశాల అధికారులు చర్చలు నిర్వహిస్తున్నారు. ముందుగా అనుకున్నట్లు అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, సీనియర్ సలహాదారు కుష్నర్ నేరుగా చర్చల్లో పాల్గొనడం లేదు. అయితే, చర్చలకు ముందు ఖతార్ ప్రధానితో సమావేశమై, తదుపరి సమావేశాలకు అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లపై చర్చించినట్లు సమాచారం.


