ఐరాస వేదికగా భారత్ ప్రతినిధి పిలుపు
న్యూయార్క్: ఉగ్రవాదం ప్రపంచానికి పెనుప్రమాదంగా తయారైంది. దాదాపు చాలా దేశాలు ఈ ముప్పును అనేక రూపాల్లో ఎదుర్కొంటున్నారు. భారత్ చాలా కాలంగా ఆ ముప్పును ఎదుర్కొంటూ వస్తోంది. తాజాగా ఇదే అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదంపై భారత్ తన వాణిని మరోసారి వినిపించింది. ఉగ్రవాద నిర్మూలనకు అందరం కలసికట్టుగా పనిచేయాలని పిలపునిచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో ఎలాంటి రాజీ లేదని ఐరాస వేదికగా భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని వెల్లడించింది. ప్రపంచ ఉగ్రవాద నిరోధక వ్యూహంపై ఐక్యరాజ్యసమితి తాజాగా జరిపిన సమీక్షలో భాగంగా భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడారు. ‘ఉగ్రవాది ఉగ్రవాదే! ఉగ్రవాదాన్ని సమర్థించడానికి ఎలాంటి కారణాలు వెతకనవసరం లేదు. అటువంటి హంతక భావజాలాన్ని సమూలంగా నిర్మూలించడానికి మనమంతా కలిసికట్టుగా పనిచేయాలి’ అని మనదేశం తరఫున హరీశ్ పిలుపునిచ్చారు. సీమాంతర ఉగ్రవాదం వల్ల భారత్ భారీగా నష్టపోతోందని, ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని ఆయన ఐరాస వేదికగా పేర్కొన్నారు.
ప్రజలు అనుభవిస్తున్న వేదన భారతదేశం వైఖరిలో మార్పు తీసుకువచ్చింది. రాజకీయ కారణాలు, వ్యూహాత్మక లెక్కలతో సంబంధం లేకుండా ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో నిస్సందేహంగా ఖండించాలి. అంతర్జాతీయ సమాజం అంగీకరించిన ప్రేమ్వర్క్ లేకపోవడం వల్ల…టెర్రరిజానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా చర్యలు తీసుకోవడం వీలుకావడం లేదు. నియమనిబంధనల్లో ఈ లోపాలను సరిచేసేలా, ఉగ్రముఠాలకు నిధులు, ఆయుధాలు అందకుండా నిరోధించేలా చట్టాలు ఆవశ్యకం అని పర్వతనేని హరీశ్ పేర్కొన్నారు.
ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరిని విడనాడి…ఒక్కతాటిపైకి రావడానికి అవసరమైన రాజకీయ సంకల్పాన్ని ప్రదర్శించాలని సభ్యదేశాలను హరీశ్ కోరారు.
ఉగ్రవాద నిర్మూలనకు కలసికట్టుగా పని చేయాలి
- Advertisement -


