విశాలాంధ్ర/శెట్టూరు : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ జనవరి 27న చేపట్టే యువగళం కార్యక్రమం పాదయాత్రలో యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని టిడిపి మండల కన్వీనర్ టిఆర్ తిప్పేస్వామి, పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి ఉమామహేశ్వర్ నాయుడు ఆదేశాల మేరకు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులుకు వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత టిడిపి ప్రభుత్వ హాయంలో నిరుద్యోగులకు అండగా ఉండేందుకు నిరుద్యోగ భృతి ఇచ్చేవారని, ప్రస్తుతం నిరుద్యోగ భృతిని తుంగలో తొక్కారని విమర్శించారు. యువతకు అండగా నిలబడాలన్న ఉద్దేశంతో యువత హక్కులు సమస్యలపై పోరాటం చేసేందుకు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జనవరి 27 నుంచి పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఆదిశేషు, బిసి మాజీ అధ్యక్షుడు నగేష్ యాదవ్,క్లస్టర్ ఇంచార్జ్ ఇమ్రాన్ ఖాన్, మాజీ ఎంపిటిసి నాగరాజు, యూత్ నాయకులు చటాకుల రాము, వడ్డే గంగాధర్,తిప్పే స్వామి, షాజహాన్, రామంజప్ప తదితరులు పాల్గొన్నారు