తెహ్రాన్: పశ్చిమాసియా ఘర్షణలు రానురాను ఉధృతమవుతున్నాయి. చర్చలు అంటూనే అమెరికా తన ఆధిపత్య ధోరణితో ముందుకి సాగుతుంటే…ఇరాన్ అందుకు తలొగ్గకుండా ప్రతిఘటిస్తోంది. దీనితో అక్కడ పరిస్తితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ఘర్షణల నుంచి వెనక్కి తగ్గేందుకు అటు అమెరికా…ఇటు ఇరాన్ సుముఖంగా కనిపించడం లేదు. ఇరాన్లోని మౌలిక వసతులను అగ్రరాజ్యం టార్గెట్ చేస్తోంది. ఖర్గ ద్వీపాన్ని సీజ్ చేయాలని, పికాక్స్ పర్వతంపై బాంబుల వర్షం కురిపించాలని యోచిస్తోంది. మరోవైపు గల్ఫ్ దేశాల్లోని డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత ఆస్తులపై గురిపెట్టాలని ఐఆర్జీసీ ప్లాన్ చేస్తున్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. తమ దేశంపై జరుగుతోన్న దాడులకు ప్రతిగా యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్లలోని యూఎస్ స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోంది. ఆ జాబితాలో ట్రంప్ బ్రాండ్తో నడిచే హోటళ్లు, గోల్ఫ్ క్లబ్బులు ఉన్నాయని సమాచారం. దుబాయ్లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ అండ్ రెసిడెన్షియల్ టవర్…దుబాయ్, సౌదీ అరేబియా, ఖతార్లోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్స్, విల్లాలు…జెడ్డా, రియాద్లోని ట్రంప్ టవర్స్, మస్కట్లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ ఉన్నాయని ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే ఎప్పుడు, ఏ తరహాలో ఐఆర్జీసీ దాడులు చేస్తుందనేది వెల్లడించలేదు. పశ్చిమాసియావ్యాప్తంగా ప్రతీకార చర్యలు ఉంటాయని ఇరాన్ పేర్కొంది. ఖతార్, బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది.
గల్ఫ్లోని ట్రంప్ ఆస్తులపై ఇరాన్ గురి
- Advertisement -
RELATED ARTICLES


