సీట్ల పునర్విభజనపై సంచలన ప్రకటన చేసిన స్టాలిన్
నూదిల్లీ/చెన్నై: రాష్ట్ర ప్రయోజనాలు, దక్షిణాది హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని డీఎంకే స్పష్టం చేసింది. పార్లమెంట్ పునర్విభజన బిల్లుపై కాంగ్రెస్తో ఎటువంటి ముందస్తు సంప్రదింపులు జరపకుండానే, సొంతంగా నిర్ణయం తీసుకుని పార్లమెంట్లో గళమెత్తాలని డీఎంకే అధినాయకత్వం నిర్ణయించింది. దేశంలో త్వరలో జరగబోయే పార్లమెంట్ పునర్విభజనకు సంబంధించిన బిల్లుపై డీఎంకే అత్యంత కీలకమైన, స్వతంత్ర నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ ఎంపీలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో లోక్సభ స్థానాల పునర్విభజన వల్ల తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టంపై సుదీర్ఘంగా చర్చించారు. ‘తమిళనాడు ప్రజల గొంతుగా పార్లమెంట్లో మన ఎంపీలు గళం విప్పాలి. రాష్ట్ర హక్కులను, ప్రజల ప్రయోజనాలను కాపాడటమే మన లక్ష్యం’ అని పార్టీ ఎంపీలకు స్టాలిన్ చెప్పారు.
ఇలా ముందుకు సాగుదాం…
పార్లమెంట్లో ప్రభుత్వం అధికారికంగా బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత…దానిలోని లోటుపాట్లు, నిబంధనలను పరిశీలించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోవాలని డీఎంకే వర్గాలు స్పష్టం చేశాయి. భవిష్యత్తులో లోక్సభ సీట్ల సంఖ్య దాదాపు 50 శాతం పెరిగే అవకాశం ఉందన్న అంచనాలపై ఈ సమావేశంలో డీఎంకే ఎంపీలు విస్తృతంగా చర్చించారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్లో తమ ప్రాతినిధ్యాన్ని (సీట్ల నిష్పత్తిని) కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే, దక్షిణాది రాష్ట్రాల సీట్ల వాటా ఏమాత్రం తగ్గకుండా పాత నిష్పత్తినే కొనసాగించాలనే ప్రతిపాదనపై కట్టుబడి ఉండాలని, ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని డీఎంకే నిర్ణయించింది.
దక్షిణాది హక్కుల పట్ల రాజీలేదు: డీఎంకే
- Advertisement -


