ఎస్సీఓలో పాకిస్థాన్ ప్రధాని`భారత్పై అసంతృప్తి
హేగ్ కోర్టు ఆదేశాలను సవాల్ చేసిన భారత్
బిష్కెక్: నీరు అనేది జీవనాధారమని, దానిని అస్త్రంగా మార్చుకోవడం, ఒత్తిడికి సాధనంగా చేసుకోవడం లేదా రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం ఎంత మాత్రం ఆమోద యోద్యం కాదని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. సింధూ జల సంధిపై వివాదం నేపథ్యంలో బిష్కెక్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సులో ఆయన భారత్పై అసంతృప్తి వ్యక్తంచేశారు. జల వనరుల ఒప్పందాల విషయంలో అంతర్జాతీయంగా కట్టుబడి ఉండాలని, షరతులు లేకుండా వ్యవహరించాలన్నారు. పాకిస్థాన్ ఎదుర్కొంటున్న ఉగ్రవాద సమస్య, నిరోధక చర్యల గురించి ఆయన ఏమీ మాట్లాడలేదు. వాస్తవానికి సింధూ జల సంధిపై ఆగస్టు 31న హేగ్లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 1960లో కుదిరిన ఈ ఒప్పందం అమల్లోనే ఉందని, భారత్ దాని బాధ్యతలను కొనసాగించాలని కోర్టు పేర్కొంది. జమ్మూకశ్మీర్లోని రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిమితం చేయాలని మధ్యంతర ఆదేశాలిచ్చింది. ఈ తీర్పును భారత్ తిరస్కరించింది. భారత సార్వభౌమ నిర్ణయాలపై తీర్పు ఇచ్చే అధికారం ఆ కోర్టుకు లేదని పేర్కొంది. సింధూ జల సంధిని పునరుద్ధరించబోమని స్పష్టంచేసింది. దీంతో అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని పాకిస్థాన్ బలంగా వినిపిస్తోంది.


