ఒడిశాలో మయూర్భంజ్లో నర్సు నిర్వాకం
బరిపడ : కొవిడ్`19 వాక్సినేషన్లో అపశృతులు కొనసాగుతున్నాయి. ఒడిశాకు చెందిన మయూర్భంజ్ జిల్లాలో వైద్య సిబ్బంది 51 ఏళ్ల వ్యక్తికి కేవలం 30 నిమిషాల్లోనే కొవిడ్ టీకా రెండు డోసులు వేశారు. ఆయన్ను రఘుపూర్ జిల్లాకు చెందిన ప్రసన్న కుమార్ సాహుగా గుర్తించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. శనివారం స్లాట్ బుకింగ్ తర్వాత తొలి డోసు కోసం ఖుంతాపూర్లోని సత్యసాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని తాత్కాలిక వాక్సినేషన్ శిబిరానికి వెళ్లాడు. ‘అక్కడ తొలి డోసు తీసుకున్న తర్వాత 30 నిమిషాలపాటు నన్ను పరిశీలనలో ఉంచారు. ఈ సమయంలో ఒక నర్సు మరొక డోసును నాకు ఇచ్చింది’ అని సాహు అన్నారు. ‘నేను అప్రమత్తం చేశాను. కానీ ఆ సమయానికే నర్సు వాక్సిన్ ఇచ్చేసింది’ అని వివరించాడు. దీంతో ఓఆర్ఎస్ పానీయం అందించి, రెండు గంటలకు పైగా పరిశీలనలో ఉండాలని ఆయన్ను కోరామని వాక్సినేషన్ కేంద్రం పరిశీలకుడు రాజేంద్ర బెహరా తెలిపారు. ఆయన పరిశీలన గదిలో కూర్చొవడానికి బదులుగా వాక్సినేషన్ గదిలో కూర్చోవడంతో పొరపాటున వైద్య సిబ్బంది ఆయనకు రెండవ డోసు ఇచ్చారని వివరించారు. బేతనాతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇన్ఛార్జి డాక్టర్ సిపున్ పాండా మాట్లాడుతూ ఆయన ఫిర్యాదు గురించి తెలుసునని, ఈ విషయాన్ని విచారణ కమిటీ పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటుందని అన్నారు. అయితే సాహు శరీరంలో ఎటువంటి దుష్ఫ్రభావాలు కనిపించలేదని, ఆయన పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ పాండా చెప్పారు.