బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ (Tariq Rahman )భారత్ పర్యటనపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నెల 23-25 తేదీల్లో ఆయన దిల్లీలో పర్యటించే అవకాశం ఉందంటూ జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని కార్యాలయం స్పందించింది. తారిఖ్ రెహమాన్ భారత్ పర్యటనపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు ఇతర నేరస్థులను అప్పగించే అంశంలో భారత్ స్పందన కోసం బంగ్లాదేశ్ ఎదురుచూస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా.. త్వరలోనే స్వదేశానికి తిరిగి వెళ్తానని ఇటీవల వెల్లడించారు.ఆమె మీడియాతో మాట్లాడటంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
హసీనాను వెంటనే అప్పగించాలి
హసీనాను వెంటనే తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ను పలుమార్లు కోరుతోంది. అయితే ఈ విషయంలో భారత్ ఆచితూచి స్పందిస్తోంది.ఇదే సమయంలో సెప్టెంబర్ 12-13 తేదీల్లో దిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు తారిఖ్ రెహమాన్ హాజరుకావాల్సి ఉంది. బ్రిక్స్ సదస్సుకు ముందుగానే ఆయన దిల్లీ పర్యటనకు వస్తారని వార్తలు వెలువడ్డాయి.బంగ్లాదేశ్ ప్రధానిని స్వాగతించే కార్యక్రమానికి సంబంధించి రిహార్సల్స్ జరుగుతున్నాయని రాష్ట్రపతి భవన్ నుంచి తొలుత ప్రకటన కూడా వెలువడింది.అయితే ఆ ప్రకటనను కొన్ని గంటల వ్యవధిలోనే ఉపసంహరించుకోవడం గమనార్హం. దీంతో తారిఖ్ రెహమాన్ భారత్ పర్యటనపై మరింత ఉత్కంఠ నెలకొంది.


