యాంటిబయాటిక్స్, నార్కోటిక్స్ డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నాం:
ఎస్పీ నరసింహ కిషోర్,
విశాలాంధ్ర – రాజమండ్రి సిటీ ; రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈగల్ టీం,దిరాజమండ్రి కెమిస్ట్సు, డ్రగ్గిస్ట్సు అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నగరంలో యాంటిబయాటిక్స్ నార్కోటిక్స్ వినియోగంపై భారీ అవగాహన ర్యాలీ, సదస్సు నిర్వహించారు. జాంపేట గాంధీ బొమ్మ సెంటర్ లో ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ జెండా ఊపి ప్రారంభించారు. డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ పి.నాగమణి నగరంలోని మెడికల్ షాపు యాజమానులు, సిబ్బంది, ది రాజమండ్రి హోల్ సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్, తూర్పుగోదావరిజిల్లా డ్రగ్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో ర్యాలీ లో పాల్గొన్నారు. మందుల వినియోగంపై అవగాహన కల్పించే ప్ల కార్డులను వారంతా ప్రదర్శించారు.ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం రాష్ఝ్ర ప్రభుత్వ పిలుపునకు స్పందించి రాజమండ్రిలోని కెమిస్ట్సు డ్రగ్గిస్ట్సు అసోసియేషన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు.యాంటిబయోటిక్స్, నార్కోటిక్స్ డ్రగ్స్ పై ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.జిల్లాలో రెండుడ్రగ్ అడిక్ట్ కేంద్రాలు ఉన్నాయని,ఇప్పటికే వాటికి అలవాటు పడిన వారికి ఈ కేంద్రాల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తామని ఆయన అన్నారు.మెడికల్ షాపుల్లో ఎక్కువ మోతాదులో ఈ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నవారి వివరాలు పోలీసులకు తెలియచేయాలని ఎస్పీ నరసింహ కిషోర్ కోరారు. గంజాయి విక్రయించే వారిపై పి.డి.యాక్టు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. గంజాయి ఉపయోగించే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు..డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ పి.నాగమణి మాట్లాడుతూ ప్రభుత్వం సూచనల మేరకు మెడికల్ షాపుల్లో మందుల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.వైద్యుల చీటీ లేకుండా కొన్ని రకాల మందులు విక్రయించకుండా చూస్తామని ఆమె చెప్పారు.
అనంతరం జాం పేట పోలీసు కన్వెన్షన్ హాలులో అవగాహన సదస్సు జరిగింది.కార్యక్రమంలో రాజమండ్రి కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పిల్లా బాల మాట్లాడుతూ, యాంటిబయోటిక్స్ , నార్కోటిక్స్ డ్రగ్స్ వినియోగంపై ప్రజలలో అవగాహన కల్గించడానికి అలాగే, డ్రగ్స్ మీద అపోహలు తొలగించడానికి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రజలు ఇష్టమొచ్చినట్లు యాంటి బయోటిక్స్ వాడడం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, అందువల్ల ప్రజలు ముందుగా డ్రగ్స్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు రాయపూడి శ్రీనివాసరావు, హోల్ సేల్ అధ్యక్షుడు మహేంద్రనాధ్, సెక్రటరీలు ఫణీంద్ర, కృష్ణ బాలాజీ , వైస్ ప్రెసిడెంట్ పెండెం రామూజీ ,ట్రెజరర్స్ సంపత్కుమార్, లాలాధర్, టౌన్ డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ హరిహర తేజ, లీగల్ ఎఎస్పి మురళీకృష్ణ (అడ్మినిస్ట్రేషన్ ) తదితరులు పాల్గొన్నారు.


