విజయవాడలోని ఏసీబీ కోర్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి భారీ ఊరట కలిగించే తీర్పు వెలువరించింది. చంద్రబాబుపై నమోదైన ఏపీ ఫైబర్ నెట్ కేసును కోర్టు పూర్తిగా కొట్టివేసింది. ఈ మేరకు తుది ఉత్తర్వులు జారీ చేశాయి. వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు సహా పలువురు అధికారులపై రూ.300 కోట్లకు పైగా టెండర్లలో అక్రమాలు జరిగాయని సీటీఐడీ కేసు నమోదు చేసింది. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువడ్డాయి. ఈ కేసు విచారణలో భాగంగా 99 మంది సాక్షులను సీటీఐడీ విచారించి, వారి వాంగ్మూలాలతో కూడిన నివేదికను కోర్టుకు సమర్పించింది.
ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదు
అయితే విచారణలో ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక నష్టం జరిగినట్లు తేలలేదు.
ఈ నేపథ్యంలోని ఫైబర్ నెట్ సంస్థ అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డి కోర్టులో అఫిడవిట్ సమర్పిస్తూ, ప్రభుత్వానికి నష్టం జరగలేదని, అందువల్ల కేసు ఉపసంహరించుకోవచ్చని ప్రకటించారు.
తాజాగా సంస్థలోని తాజా ఎండీ గీతాంజలి కూడా కేసు ఉపసంహరణకు అభ్యంతరం లేదని కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. కానీ, ఫైబర్ నెట్ అప్పటి చైర్మన్ గౌతం రెడ్డి కేసును క్లోజ్ చేయవద్దంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
చంద్రబాబుకు భారీ ఊరట
ఈ పిటిషన్ను పరిశీలించిన ఏసీబీ కోర్టు గౌతం రెడ్డి అభ్యర్థనను తిరస్కరించింది. కోర్టు, కేసును కొనసాగించాల్సిన అవసరం లేదని స్పష్టంగా పేర్కొంది.అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి, ఫైబర్ నెట్ కేసును పూర్తిగా కొట్టివేసి తుది ఉత్తర్వులు జారీ చేశారు.ఈ తీర్పుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాజకీయ, వ్యక్తిగతంగా భారీ ఊరట లభించింది.


