దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతకు చేరింది. శీతాకాలం కారణంగా పరిస్థితి మరింత కష్టం అయ్యింది.కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) తాజా సమాచారం ప్రకారం, శనివారం తెల్లవారుజామున దిల్లీలో వాయు నాణ్యత సూచీ 387గా నమోదయింది. నగరంలోని అనేక ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పివేయడంతో దృశ్యగోచరత గణనీయంగా తగ్గింది. ఇందుకని దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు హెచ్చరిక జారీ చేసింది. అయితే విమాన సర్వీసులు సాధారణంగా కొనసాగుతున్నాయి. విమానాల సమయాల్లో మార్పులు లేదా తాజా సమాచారం కోసం ప్రయాణికులు సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని ఎయిర్పోర్ట్ అధికారులు సూచించారు.
ప్రభావిత ప్రాంతాలివే
రాజధానిలోని 18 ప్రాంతాల్లో 400 పైగా (AQI) నమోదయినట్లు CPCB అధికారులు వెల్లడించారు.
అత్యంత ప్రభావిత ప్రాంతాలు ఇలా ఉన్నాయి
వివేక్ విహార్ – 437
వజీర్పూర్ – 443
ఆనంద్ విహార్ – 434
జహంగీర్పురి – 439
నరేలా – 425
బవానా – 424
నోయిడా – 422
నగరంలోని పలు ప్రాంతాలు తీవ్ర కాలుష్య స్థాయిల జోన్లోకి వెళ్లినందున, అధికారులు వాయు నాణ్యతను నియంత్రించడానికి ముమ్మరం చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.


