ఆంధ్రప్రదేశ్లో 2027 జనగణన ప్రక్రియకు కీలక ప్రారంభం జరిగింది.ఇవాళ్టి (ఏప్రిల్ 16) నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండు దశల్లో ఈ భారీ కార్యక్రమం అమలు కానుంది.ఈసారి జనగణనను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహించడం ప్రత్యేకతగా నిలుస్తోంది.మొదటి దశలో గృహాల జాబితా, నివాస గణన నిర్వహిస్తారు. ఇందులో రాష్ట్రంలోని భవనాలు, ఇళ్లు, వాటి నిర్మాణ లక్షణాలు వంటి వివరాలను సేకరించి, తరువాతి దశకు అవసరమైన సిబ్బంది, వసతులను అంచనా వేస్తారు.రెండో దశలో జనాభా గణనతో పాటు సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వలసలు, జననాలు, మరణాల వివరాలను నమోదు చేస్తారు.
ఈసారి ప్రజలకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వయం నమోదు)కు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు ప్రజలు తమ మొబైల్ సంఖ్యతో అధికారిక పోర్టల్లోకి లాగిన్ అవ్వొచ్చు.
తమ నివాసాన్ని భౌగోళిక గుర్తింపుతో నమోదు చేసి, వివరాలను నేరుగా సమర్పించవచ్చు.ఇలా నమోదు చేసిన వారికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య లభిస్తుంది. సిబ్బంది ధృవీకరణకు వచ్చినప్పుడు ఈ సంఖ్యను చూపిస్తే సరిపోతుంది.ప్రజలు అందించే వ్యక్తిగత వివరాలు చట్టపరంగా అత్యంత గోప్యంగా ఉంటాయని అధికార ప్రతినిధులు తెలిపారు.సమాచార భద్రత కోసం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సమగ్ర రక్షణ వ్యవస్థను అమలు చేశారు. అనధికారిక ప్రవేశాన్ని నిరోధించేందుకు భద్రతా తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమం కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.1 లక్షల మంది లెక్కింపు సిబ్బంది, పర్యవేక్షకులను నియమించారు.వీరికి తోడుగా మరో 3,500 మంది సిబ్బంది సహకరిస్తున్నారు.రాష్ట్రంలోని 28 జిల్లాలు, 688 మండలాలు, 123 పట్టణ పాలక సంస్థలు, సుమారు 16,862 గ్రామాల్లో ఈ లెక్కింపు చేపడుతున్నారు.
2026 జనవరి 1 నాటికి ఉన్న పరిపాలనా విభాగాల ఆధారంగా ఈ సమాచారం సేకరణ జరుగుతుంది.
గృహాల లెక్కింపులో భాగంగా మొత్తం 33 ప్రశ్నలు అడుగుతారు. ఇల్లు నిర్మాణానికి ఉపయోగించిన పదార్థాలు, కుటుంబ సభ్యుల సంఖ్య, ఎస్సీ/ఎస్టీ హోదా వివరాలు, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్డి, వంట ఇంధనం వంటి మౌలిక సదుపాయాలతో పాటు దూరదర్శిని, అంతర్జాలం, వాహనాల వంటి ఆస్తుల వివరాలను కూడా నమోదు చేస్తారు.
సంక్షేమ పథకాల రూపకల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ సమాచారం కీలకంగా ఉపయోగపడనుంది.జనగణన విధుల్లో అంతరాయం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.ఈ ప్రక్రియ భారతీయ భాషల్లో మొత్తం 16 భాషల్లో అందుబాటులో ఉంటుంది. 1872 నుంచి లెక్కిస్తే ఇది 16వ జనగణన కాగా, స్వాతంత్య్రానంతరం ఇది 8వది.


