ముంబై: ఐపీఎల్`2026లో భాగంగా ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 18 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీనిపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తమ జట్టు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నాడు. జట్టు కూర్పులో మార్పులు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నాడు. ‘మేం త్వరత్వరగా వికెట్లు కోల్పోయాం. బౌలింగ్లో ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాం. ఇంకా మేం మెరుగవ్వాల్సి ఉంది. గత రెండు, మూడు మ్యాచుల్లోనూ మేం బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆశించిన మేరకు రాణించలేకపోయాం’ అని హార్దిక్ పాండ్య వివరించాడు. రాబోయే మ్యాచుల్లో తమ జట్టులో మార్పులు ఉండే అవకాశముందని హింట్ ఇచ్చాడు. చాలా ఎంపికలను విశ్లేషించాల్సి ఉంది. తర్వాత జరగబోయే మ్యాచుల్లో తప్పకుండా జట్టు కూర్పులో మార్పులు చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పాడు. పవర్ప్లేలో మరిన్ని ఎక్కువ పరుగులు సాధించాలి. నిన్నటి మ్యాచ్లో రూథర్ఫోర్డ్ పోరాటం జట్టుకు ఎంతో ఉపయోగపడింది. అతడు టీమ్కు అదనపు బలం అని పాండ్య తెలిపాడు. కాగా…ఆర్సీబీతో మ్యాచ్లో రూథర్ఫోర్డ్ కేవలం 31 బంతుల్లో 71 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. చెలరేగి సిక్స్లు కొట్టాడు.అతడి పోరాటం వధా అయింది. ముంబై ఇండియన్స్కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 240 పరుగులు చేసింది. ఛేదనలో ముంబై జట్టు 222 పరుగులకే పరిమితమైంది.


