ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18వ తేదీ సాయంత్రం మేడారం చేరుకోనున్నారని, 19వ తేదీ ఉదయం అక్కడ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి పనుల సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రులు ఈ వివరాలను వెల్లడించారు.
మేడారం జాతర ఏర్పాట్ల కోసం రూ.251 కోట్ల వ్యయంతో పనులు చేపట్టామని, సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం తుది దశకు చేరిందని చెప్పారు. ఈ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు.
రాబోయే ఎన్నికల్లోనూ ఆ పార్టీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: పొంగులేటి
అదే సమయంలో రాజకీయ అంశాలపై స్పందించిన మంత్రి పొంగులేటి, జూబ్లీహిల్స్ ఉపఎన్నికను తమ పాలనకు రెఫరెండంగా ప్రకటించిన కేటీఆర్ ఆ ఎన్నికలో ఘోర పరాజయం పాలయ్యారు అంటూ విమర్శించారు.హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.పంచాయతీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన భారాస పార్టీ, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలను సెమీఫైనల్గా ప్రకటించుకుంటూ ముందుకు రావడం సిగ్గుచేటని అన్నారు.రాబోయే ఎన్నికల్లోనూ ఆ పార్టీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ముందు తమ పార్టీలోని అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.


