ఆర్థిక విధ్వంసం చేసి అందరినీ ఇబ్బంది పెట్టారు
వైసీపీ పాలనపై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత పాలన సైకో పాలన.. ఆర్థిక విధ్వంసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకులు పెన్షన్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారని, ఎన్నికల ముందు రాక్షస పాలన చూశామని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో ఇబ్బందిపడుతూ పెన్షన్లు పెంచారని అయితే కూటమి పాలనలో ఒక్కసారే పెన్షన్లు పెంచామని ప్రజలకు వివరించారు. ఐదేళ్లు ఏపీ ప్రజలు సైకో పాలన చూశారని అన్నారు.గత పాలనలో అందరినీ ఇబ్బందిపెట్టారని.. అందుకే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ పొత్తు కోసం ముందుకువచ్చారని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి ఆడబిడ్డలపై జగన్ తన దినపత్రికలో దారుణంగా చిత్రీకరించారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. జగన్ పొదిలి వచ్చిన సమయంలో ఆడబిడ్డలు క్షమాపణ చెప్పమని అడిగారని అయితే, వారిపై దౌర్జన్యం చేశారని చంద్రబాబు తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వ్యక్తి గత జీవితాన్ని ఒక మాజీ ఎమ్మెల్యే విమర్శించాడని.. అతను పశువువా లేకా మనిషా అర్థం కావడం లేదని చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. నేనైతే మరోసారి అలాంటివి జరగకుండా మందలించేవాడిని అని కానీ జగన్ ఆ మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి పరామర్శించాడని అన్నారు.
బూతుల పంచాంగం నేర్చుకుంటున్నారు
గుంటూరులో జగన్ కారు కింద కార్యకర్తలు పడితే చికిత్స చేయకుండా పక్కన పడేశారన్నారు. జగన్ని చూసి వారి నాయకులు, కార్యకర్తలు గొడ్డలి వేట్లు, బూతుల పంచాంగం, రప్పారప్పా అంటూ నేర్చుకుంటున్నారని చంద్రబాబు అన్నారు.


