కొత్త సిబ్బందిని వెనక్కి పంపించిన లాలూ
బీహార్ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర సంచలనం చోటుచేసుకుంది. ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవిలకు ఇన్నాళ్లూ ఉన్న అత్యున్నత ‘Z+’ కేటగిరీ భద్రతను బీజేపీ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీని స్థానంలో బీహార్ స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ సిబ్బందిని కేటాయించింది. లాలూ కుటుంబం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా నిరసించింది. తమ నివాసానికి వచ్చిన కొత్త భద్రతా సిబ్బందిని వారు లోపలికి రానివ్వకుండా వెనక్కి పంపేశారు. భద్రత ఉపసంహరణతో పాట్నాలోని లాలూ యాదవ్ నివాసం (10, సర్క్యులర్ రోడ్) వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆర్జేడీ నేతలు, కార్యకర్తలు చేతుల్లో కర్రలు పట్టుకుని లాలూ నివాసానికి స్వయంగా కాపలా కాస్తున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. లాలూ చిన్నకుమారుడు, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ కు ఉన్న ‘Y+’ భద్రతను, లాలూ కుమార్తె మిసా భారతికి ఉన్న భద్రతను మాత్రం కొనసాగించారు. కానీ తన తల్లిదండ్రుల భద్రతను తగ్గించడాన్ని నిరసిస్తూ తన భద్రతా సిబ్బందిని తేజస్వి వెనక్కి పంపించేశారు. లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్కు ఉన్న ‘Y+’ సెక్యూరిటీని తొలగించి కేవలం ఒకే ఒక్క కానిస్టేబుల్ను మాత్రం కేటాయించారు. ఈ భద్రత తగ్గింపు వ్యవహారంపై లాలూ మరో కుమార్తె రోహిణి ఆచార్య బీహార్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “మా కుటుంబానికి హాని చేయాలనే దురుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. బీహార్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసిన మా అమ్మను రాజకీయ కక్షసాధింపుతోనే టార్గెట్ చేస్తున్నారు. ప్రజలే వీరికి తగిన బుద్ధి చెబుతారు” అని రోహిణి మండిపడ్డారు.
జడ్ ప్లస్ సెక్యూరిటీ తొలగింపు…లాలూ నివాసం ముందు కర్రలతో కాపలా…
- Advertisement -


