–చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ
బీజింగ్: భారత్, చైనాలు సత్సంబంధాలు, స్నేహాన్ని కాపాడుకోవాలి. పరస్పరం ప్రత్యర్థుల్లా కాకుండా భాగస్వాములుగా ఉండాలని చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ వ్యాఖ్యానించారు. చైనా రాజధాని బీజింగ్లో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఏర్పాటుచేసిన మీడియా వార్షిక సమావేశంలో వాంగ్ మాట్లాడుతూ.. ‘‘అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకుండా సంబంధాలను మెరుగుపరచుకునేందుకు భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లు యత్నించాలి. ఒకరికొకరు ముప్పు అని భావించకుండా, అభివృద్ధికి తోడ్పడే అవకాశంగా చూడాలని ఆయన హితవు పలికారు. 2024లో కజాన్ వేదికగా మోదీ, జిన్పింగ్ల సమావేశంతో ఇరుదేశాల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందన్నారు. గతేడాది తియాంజిన్లో ఇరునేతల భేటీ తర్వాత అవి మరింత మెరుగయ్యాయి. ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డుస్థాయికి చేరుకోవడం, ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపడటం వంటివి ఇరుదేశాలకూ ప్రయోజనం చేకూర్చాయని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగిస్తూ, అభివృద్ధిపై దృష్టి సారించాలి. పొరుగు దేశాలుగా, గ్లోబల్ సౌత్ సభ్యులుగా.. భారత్, చైనా దీర్ఘకాలిక సంబంధాలు కలిగి ఉన్నాయి. పరస్పర విశ్వాసం, సహకారాలు రెండు దేశాల అభివృద్ధికి ప్రయోజనకరంగా ఉంటాయి. విభజనవాదం, ఘర్షణలు.. అభివృద్ధిని దెబ్బతీస్తాయని వాంగ్ పేర్కొన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులను, ముఖ్యంగా సుప్రీం నేత ఖమేనీ హత్యను వాంగ్ ఖండించారు.


