కరాచీ: భారత్పై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తీవ్ర ఆరోపణలు చేశారు. సింధూ జలాల ఒప్పందం రద్దుపై మాట్లాడుతూ.. రాజకీయ అవసరాల కోసం భారత్ నీటిని ఆయుధంలా వాడుకుంటోందన్నారు. తమ దేశంతో మరో యుద్ధం చేయడానికి భారత్ సన్నాహాలు చేస్తోందన్నారు. ప్రాంతీయ శాంతికి మద్దతుదారుగా తాను ఇటువంటి చర్యలను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. భారత అధికారులు యుద్ధ ఆలోచనల నుంచి వెనక్కి తగ్గి తమతో చర్చలకు రావాలని కోరారు. ప్రాంతీయ భద్రతకు శాంతి చర్చలే ఏకైక మార్గమని అన్నారు. జమ్మూకశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి, కశ్మీర్లోని ప్రజలకు అవసరమైన దౌత్యపరమైన సహాయాన్ని అందించడానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉందని జర్దారీ పేర్కొన్నారు. ఆ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేవరకు దక్షిణాసియాలో శాశ్వత శాంతి నెలకొనడం అసాధ్యమన్నారు. పాకిస్థాన్లో శాంతిని అస్థిరపరిచేందుకు అఫ్గాన్ ప్రయత్నాలు చేస్తోందని.. వాటిని అడ్డుకోవడానికి తమ దళాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయన్నారు. తాలిబన్లు ప్రపంచంలోని ఉగ్రవాదులందరినీ సమీకరించి ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతోన్న సంఘర్షణను జర్దారీ ఖండించారు. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ హత్యకు సంతాపం తెలిపారు. యూఏఈ, బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలపై దాడులు చేయడం సరైన చర్య కాదన్నారు.
రాజకీయ అవసరాల కోసం భారత్ నీటిని ఆయుధంలా వాడుకుంటోంది : పాక్ అధ్యక్షుడు
- Advertisement -
RELATED ARTICLES


