కూటమి సర్కార్పై విరుచుకుపడ్డ జగన్
రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి హాని కలిగించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వైసీపీ అధినేత జగన్ మోహన్రెడ్డి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి హాని కలిగించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో రాష్ట్ర ప్రజలను పెద్ద మోసం చేశారు. ఓట్లు పొందడానికే అన్నట్లుగా ఈ హామీలు నిలిచిపోయాయి. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నిరసనలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. రైతులు, విద్యార్థులు తమ ఆశలను కోల్పోతున్నారు. విద్యార్థులు చదువు మానేసి ఉపాధి కోసం తిరుగుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యాత్ ఛార్జీలను ఏడాదిలోనే రూ.15 వేల కోట్లకు పెంచారు. దీనివల్ల సామాన్యులు నలిగిపోతున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన పాత బిల్లుల్ని మర్చిపోయి కొత్త మోసాలతో ముందుకు సాగుతోంది. వైసీపీకి వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక పార్టీ కార్యకలాపాలను అణిచివేయాలని చూస్తున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థ ప్రజలకు అండగా ఉండేది. కానీ ప్రస్తుతం రాజకీయ ప్రతీకారానికి ఉపయోగపడేలా మారిపోయింది. మా పాలనలో మేమ ఏ సమస్యనైనా పార్టీలతో సంబంధం లేకుండా పరిష్కరించాం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట అధికారులు వినకపోతే వాళ్లకు జైలు శిక్షలు పడుతున్నాయి. 5 లక్షల మందిని పెన్షన్ లిస్ట్ నుంచి తీసేశారు. రైతు భరోసా ఏమైందో చంద్రబాబు చెప్పాలి. ప్రతి మహిళకు ఏడాదికి రూ.18 వేలు ఇస్తామన్న హామీ ఏమైంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. పొలిటికల్ గవర్నెన్స్ ను టేకోవర్ చేసి నడిపిస్తున్నారని జగన్ తీవ్ర విమర్శలు చేశారు.


