మన భూభాగాన్ని చైనా ఆక్రమించినట్లు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సోమవారం సుప్రీంకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. నిజమైన భారతీయులు అలా మాట్లాడరు అని కోర్టు ఆ కేసులో పేర్కొన్నది. కోర్టు చేసిన వ్యాఖ్యలపై రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీ స్పందించారు. ఇవాళ పార్లమెంట్ ఆవరణలో అడిగిన ఓ ప్రశ్నకు ఆమె బదులిస్తూ రాహుల్ను సమర్ధించారు. ప్రశ్నలు వేయడం, ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రతిపక్ష నేత విధి అని ఆమె అన్నారు. నిజమైన భారతీయులు కాదా అన్న స్టేట్మెంట్పై మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థ పట్ల పూర్తి గౌరవం ఉందని, కానీ నిజమైన భారతీయుడిని తేల్చేది జడ్జీలు కాదు అని ఆమె అన్నారు. రాహుల్ గాంధీ సైన్యాన్ని, సైనికులను ఎల్లప్పుడూ గౌరవించారని ఆమె పేర్కొన్నారు.
నిజమైన భారతీయుడు ఎవరన్న దానికి నిర్వచనం ఎవరు ఇస్తారని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు. పార్లమెంట్లో ప్రశ్నలు వేస్తే సమాధానం ఇవ్వడం లేదని, కానీ పార్లమెంట్ బయట మాట్లాడితే జాతి వ్యతిరేకులమని ముద్ర వేస్తున్నట్లు ఆరోపించారు. ఇలాంటి సందర్భంలో నిజమైన భారతీయుడికి నిర్వచనం ఎవరు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. మేం నిజమైన భారతీయులమని, అందుకే దేశం తరపున ప్రశ్నలు వేస్తున్నామన్నారు.


