అమరావతి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో అరెస్టయిన సాక్షి ఛానల్ న్యూస్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆయనకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టు నేడు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నాడు కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనను ఇవాళ గుంటూరు జిల్లా మంగళగిరిలోని కోర్టు ముందు హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఉత్తర్వుల అనంతరం కొమ్మినేని శ్రీనివాసరావును తదుపరి చర్యల నిమిత్తం గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.