రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నమోదైన కేసులో అరెస్టయిన సీనియర్ జర్నలిస్టు, సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఈరోజు గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, కోర్టు సెలవుల కారణంగా ఆయన విడుదల ప్రక్రియలో జాప్యం జరిగింది.కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు జూన్ 13న బెయిల్ మంజూరు చేసింది. అయితే, సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు జైలు అధికారులకు శుక్రవారం సాయంత్రం వరకు చేరలేదు. శని, ఆదివారాలు కోర్టులకు సెలవు దినాలు కావడంతో ఆయన విడుదల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో, ఈరోజు మంగళగిరి కోర్టులో అవసరమైన షూరిటీలను సమర్పించిన అనంతరం కొమ్మినేని గుంటూరు జైలు నుంచి విడుదల కానున్నారు.
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై జూన్ 9వ తేదీన తుళ్లూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం, ఈ నెల 10వ తేదీన ఆయన్ను మంగళగిరి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
రిమాండ్ విధించిన తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్ కోసం తొలుత హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయన పిటిషన్ విచారణలో ఉండగానే, ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయన పిటిషన్ను విచారించిన ధర్మాసనం, జూన్ 13న బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన విడుదల కోసం న్యాయపరమైన ప్రక్రియలు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.