పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులు తమకు కావాల్సిన పరికరాలను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.ఈ విషయంపై తాజాగా దర్యాప్తు బృందాలు ఒక ఓవర్ గ్రౌండ్ వర్కర్ ను అదుపులోకి తీసుకొని కీలక సమాచారం సేకరించాయి.దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆపరేషన్ మహాదేవ్ సమయంలో ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో మూడు మొబైల్ ఛార్జర్లు స్వాధీనం చేసుకున్నాం. ఆ తరువాత టెక్నికల్ పరిశీలనలో వాటిలో ఒక ఛార్జర్ ఒక ఫోన్తో పాటు కొనుగోలు చేసినట్లు గుర్తించాము అని తెలిపారు. పరిశీలనలో అది ఒక ఆన్లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
మొబైల్ కొనుగోలు చేసిన ముసాయిబ్ అహ్మద్ చోపాన్
దీన్ని స్థానికంగా ఉన్న ఇక్బాల్ కంప్యూటర్స్కి చెందిన ముసాయిబ్ అహ్మద్ చోపాన్ అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లు దర్యాప్తు బృందాలు నిర్ధారించాయి.ముసాయిబ్ అహ్మద్దు తన పరిశీలనలో ఆ ఛార్జర్లను ఎండీ యూసఫ్ కటారి కి విక్రయించినట్టు అంగీకరించాడు.అంతకుముందు ఇంటరాగేషన్లో యూసఫ్ కటారి కూడా డాచిగావ్ అడవుల్లో దాగి ఉన్న ఉగ్రవాదులకు ఆ వస్తువులను అందించారని గుర్తించారు.
మహ్మద్ యూసఫ్ కటారి అరెస్ట్
ఈ కేసులో ముఖ్యంగా ఉగ్రవాదులకు అవసరమైన పరికరాలను అందించడం లో జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాకు చెందిన మహ్మద్ యూసఫ్ కటారి (26)ను అరెస్ట్ చేశారు.2025 ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి జరిగింది.ఆ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘాతుక సంఘటనకు పాల్పడిన ముగ్గురు టెర్రరిస్టులను జులై 29న ఆపరేషన్ మహాదేవ్ లో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఆ ముగ్గురిలో సులేమాన్ (అలియాస్ అసిఫ్) ను ఈ దాడికి మాస్టర్ మైండ్గా గుర్తించారు. మిగతా ఇద్దరిని జిబ్రాన్, హమ్జా అఫ్గానీగా గుర్తించారు.


