ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బి. కేశవరెడ్డి పిలుపు
విశాలాంధ్ర -అనంతపురం : జూన్ 2 వతేదీన ఈ అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా. భారతకమ్యూనిస్టు పార్టీ మరియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా.ఎమ్మార్వో కార్యాలయాలవద్ద ధర్నా విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. రాష్ట్ర కార్యదర్శి బి కేశవరెడ్డి గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టో లో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, నగర ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి పట్టాలు ఇస్తూ ఇంటి నిర్మాణానికి రూ. 4 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. ఇసుక, ఇనుము, సిమెంటు ధరలు పెరగడం వలన ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఇవ్వాలని కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తుంది అన్నారు. గ్రామ సచివాలయాల వద్ద, ఎమ్మార్వో, జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దశలవారీగా ఉద్యమం నడపడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం క్యాబినెట్లో ఇంటి స్థలాల పంపిణీ చేయడానికి అంగీకారం తెలిపింది అన్నారు. ఇంతవరకు ఇచ్చిన దరఖాస్తులను విచారణ చేయలేదన్నారు. తక్షణమే ఇంటి స్థలాల దరఖాస్తులు చేసుకున్న వారికి సర్వే చేయాలని అర్హుల జాబితాను ప్రకటించాలన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 33 లక్షల మందికి స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. అప్పట్లో ఇంటి నిర్మాణాలు చేపట్టలేదు అన్నారు. టిడ్కో ఇంటికి సంబంధించి 80 శాతం పూర్తి అయిందని ప్రభుత్వం సంవత్సరం కాలం గడుస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టలేదు అన్నారు. టిడ్కో ఇంటి కోసం 25 వేల నుంచి లక్ష రూపాయల వరకు డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. వారికి బ్యాంకు నుంచి ఈఎంఐ కట్టాలని ఒత్తిడి వస్తోందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలు సంవత్సరం గడుస్తున్న అమలు కాలేదన్నారు. పింఛన్ రూ. 4000 ఇస్తూ చాలామందికి కోత పెడుతున్నారన్నారు. సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నారు కానీ ఒక్క సిలిండర్ కు మాత్రమే సబ్సిడీ వస్తుందన్నారు. తల్లికి వందనం, ప్రతి మహిళకు నెలకు 1,500 ప్రతి మహిళకు ఉచిత బస్సు సర్వీస్ ఇంతవరకు అమలు కాలేదన్నారు. రైతు సుఖీభవ పథకం కింద రూ. 20 వేలు ఇస్తామన్నారు కానీ ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు. ఈ విషయాలపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని సిపిఐ మరియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీలు పిలుపుమేరకు అనంత జిల్లాలో పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కార్యాచరణ చేపట్టడం జరుగుతుందన్నారు.