విశాలాంధ్ర – పాయకరావుపేట : పట్టణంలోని రాజుగారిబీడులో నూతనంగా ఏర్పాటు చేయ తలపెట్టిన సాయిబాబా ఆలయానికి సంబంధించి శ్రీ మహాగణపతి, దత్తాత్రేయ సహిత శ్రీ సాయిబాబా వారి విగ్రహాలతో కలశాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. వైసీపీ నాయకులు జగతా శ్రీను, చంటి స్వామి, దగ్గుపల్లి సాయిబాబా ఆధ్వర్యంలో పట్టణంలోని సీతారామస్వామి ఆలయం నుండి మేళ తాళాలతో, కోలాట భజనతో అంగరంగ వైభవంగా విగ్రహాల ఊరేగింపు సంకల్ప సాయి ఆలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా గోపూజ, అఖండ దీపారాధన, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, వేదిక స్థాపన, వాస్తు మండపారాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మత్స్యం గ్రహణం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, జలాధివాసం, క్షీరాధివాసం, లక్ష్మీ గణపతి హోమం, సాలాహోమం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈనెల 5వ తేదీన శ్రీ సంకల్ప సాయి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.


