ఎంపీడీవో గీతావాణి
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : జనాభా నిర్వహణ విధానంపై ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు క్యూఆర్ కోడ్ విధానం ద్వారా ప్రజాభిప్రాయ సేకరణను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో గీతా వాణి తెలిపారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో రెవిన్యూ, మెడికల్, ఐసిడిఎస్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనాభా నిర్వహణ విధానం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ పేపర్ను విడుదల చేసిందన్నారు. సాధారణంగా జనాభా పెరుగుదల, తగ్గుదలలో వివిధ రకాల కారణాలు ఉంటాయని, భవిష్యత్తు తరాలకు మంచి సమాజాన్ని అందించేందుకు ప్రత్యేకమైన జనాభా నిర్వహణ విధానం రూపొందించేందుకు సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో యూత్ రేటింగ్ పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ప్రతి కుటుంబంలో జనాభా పెరుగుదలకు అవగాహన ఎంతో అవసరమన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా క్యూఆర్ కోడ్ ద్వారా 9 ప్రశ్నలు ఇవ్వడం జరిగిందని, వాటి ద్వారా ప్రజల నుంచి అభిప్రాయలను సేకరించాలని సచివాలయ ఉద్యోగులను ఎంపీడీవో ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ బాలకృష్ణ, ఈ ఓ ఆర్ డి విజయభాను, ఏఎస్ఓ రామాంజనేయులు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు పద్మావతి, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు అంగన్వాడి, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.