డీకే శివకుమార్ నివాసంలో సంబరాలు!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నేడు తన అధికారిక నివాసం ఃకావేరిఃలో ఏర్పాటు చేసిన అల్పాహార విందు సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతో ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ తదుపరి సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.
ఈ వార్త వెలువడగానే బెంగళూరులోని సదాశివనగర్లో ఉన్న డీకే శివకుమార్ నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఆయన మద్దతుదారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నినాదాలు చేస్తూ, మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. దీంతో ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.
క్యాబినెట్ సహచరులతో జరిగిన సమావేశంలో సిద్ధరామయ్య తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. తదుపరి సీఎంగా డీకే శివకుమార్ను నియమించాలని కాంగ్రెస్ అధిష్ఠానం తనకు సూచించిందని ఆయన మంత్రులకు తెలిపినట్టు సమాచారం. ఈ ప్రకటన సమయంలో సిద్ధరామయ్య భావోద్వేగానికి గురయ్యారని, ఇంతకాలం నేను చేసిన పనుల పట్ల సంతృప్తిగా ఉన్నానుఁ అని తన సహచరులతో అన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ మధ్యప్రదేశ్లో వ్యక్తిగత పర్యటనలో ఉన్నందున, సిద్ధరామయ్య మధ్యాహ్నం లోక్ భవన్కు వెళ్లి తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. అనంతరం సాయంత్రం 3 గంటలకు తన మరో అధికారిక నివాసం ఃకృష్ణఃలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. సిద్ధరామయ్య రాజీనామాతో డీకే శివకుమార్కు సీఎం పీఠం ఖాయమైందని మంత్రి హెచ్.కె. పాటిల్ కూడా ధృవీకరించారు.


