బిహార్ ఓటర్ల జాబితాపై తేజస్వీ ఆగ్రహం!
నిజం కాదని స్పష్టం చేసిన ఈసీ
బిహార్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన ఓటర్ల ముసాయిదా జాబితా చుట్టూ వివాదం రేగుతోంది. ఈ జాబితాను శుక్రవారం ప్రకటించిన అనంతరం దానిపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్జేడీ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ (TEJASWI YADAV) ఈ జాబితాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా పట్నాలో జరిగిన ఓ మీడియా సమావేశంలో తేజస్వీ మాట్లాడుతూ ముసాయిదా ఓటర్ల జాబితాలో తన పేరు కనిపించలేదని ఆరోపించారు.
నా ఈపీఐసీ (EPIC) నంబరుతో ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా వెరిఫై చేశా. కానీ ముసాయిదా జాబితాలో నా పేరు లేదు. అలాంటి పరిస్థితిలో నేను ఎన్నికల్లో ఎలా పోటీ చేయగలని ప్రశ్నించారు.
బూత్ లెవెల్ అధికారి స్వయంగా తన వద్దకు వచ్చి ఫారం తీసుకెళ్లారని కూడా ఆయన తెలిపారు.
అయినా తన పేరు జాబితాలో లేకపోవడాన్ని హెచ్చరికలే నిదర్శనంగా అభివర్ణించారు.
ఇది ఒక్క తనకే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుమారు 20వేల నుంచి 30వేల ఓటర్లు జాబితా నుంచి తొలగించారని తేజస్వీ ఆరోపించారు. మొత్తం మీద రాష్ట్రంలో సుమారు 65 లక్షల ఓటర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించారని పేర్కొన్నారు.
నిజం కాదని స్పష్టం చేసిన ఈసీ
తేజస్వీ యాదవ్ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించింది.ఆయన ఆరోపణలు నిజం కాదని స్పష్టంగా తెలిపింది. ముసాయిదా ఓటర్ల జాబితాలో తేజస్వీ పేరు ఉందని చెప్పింది.ఇందుకు సంబంధించి స్పష్టతనిచ్చే ఆధారాలుగా ఆయన పేరు ఉన్న జాబితా కాపీని కూడా విడుదల చేసింది. బహుశా తేజస్వీ యాదవ్ తన పాత ఈపీఐసీ నంబరుతో తన వివరాలు వెతికే ప్రయత్నం చేసి ఉండవచ్చని, అందువల్లే పేరు కనిపించకపోవచ్చని ఈసీ పేర్కొంది.ఈ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అనంతరం రూపొందించారు.
65 లక్షల మంది ఓటర్ల తొలగింపు
ఈ సవరణలో భాగంగా మొత్తం వంచనగా లేదా డూప్లికేట్గా గుర్తించిన 65 లక్షల మంది ఓటర్లను తొలగించినట్టు ఈసీ స్పష్టం చేసింది.దాంతో ఓటర్ల మొత్తం సంఖ్య 7.93 కోట్ల నుంచి 7.28 కోట్లకు తగ్గింది. ఈ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, సవరణలు తెలియజేయడానికి ఎన్నికల సంఘం సెప్టెంబరు 1వ తేదీ వరకు గడువునిచ్చింది.కాగా బిహార్లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.


