Tuesday, November 18, 2025
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లారుణాలు మంజూరులో జాప్యం తగదు

రుణాలు మంజూరులో జాప్యం తగదు

- Advertisement -


-కౌలు రైతులకు సత్వరమే సాగు రుణాల మంజూరు చేయాలి
-సీసీఆర్‌సీ కార్డులపై పంట రుణాల లక్ష్యాలు చేరుకోవాలి…
-బ్యాంకర్లకు సూచించిన జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ

విశాలాంధ్ర`విజయవాడ: సీసీఆర్‌సీ కార్డులున్న ప్రతి అన్నదాతకూ సత్వరం పంట రుణాలు మంజూరు చేయాలని.. ఇందుకు ప్రతి బ్యాంకు బ్రాంచ్‌లో క్రెడిట్‌ డే నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ బ్యాంకర్లకు సూచించారు.సీసీఆర్‌సీ కార్డులున్న కౌలు రైతులకు సాగు రుణాల మంజూరుపై కలెక్టర్‌ లక్ష్మీశ.. జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియతో కలిసి బుధవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కౌలు రైతులకు 56 వేల సీసీఆర్‌సీ కార్డుల జారీ లక్ష్యం కాగా ఇప్పటికే 42,415 కార్డులు అందించడం జరిగిందని, ఈ నేపథ్యంలో వారికి సత్వరం బ్యాంకులు రుణాలు అందించేందుకు చొరవ చూపాలన్నారు. రుణాలు పొందడం వారి హక్కు అని, దీన్ని దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు, బ్రాంచుల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు కృషిచేయాలన్నారు. సీసీఆర్‌సీ రుణాల మంజూరు అనేది బ్యాంకుల పనితీరుకు కీలక ప్రగతి సూచిక అని, ఇందులో మెరుగైన పనితీరు కనబరిచిన బ్యాంకులు, బ్రాంచులకు తగిన గుర్తింపు ఇవ్వడం జరుగుతుందన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక రంగ వృద్ధికి, రైతులు, కౌలు రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. చాలా అంశాల్లో ఎన్‌టీఆర్‌ జిల్లా ముందంజలో ఉంటోందని, సీసీఆర్‌సీ కార్డులపై రుణాల మంజూరులోనూ జిల్లాను ముందు వరుసలో నిలపడంలో బ్యాంకులు భాగస్వాములు కావాలన్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు కూడా కౌలు రైతులు పంట రుణాలు పొందడంలో సహాయసహకారాలు అందించాలని కలెక్టర్‌ లక్ష్మీశ ఆదేశించారు. తుపాన్లు, కరువు, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వివిధ పంటలకు బీమా పరిహారం పొందేందుకు అందుబాటులో ఉన్న ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), పునర్నిర్మించిన వాతావరణ ఆధారిత పంట బీమా పథకం (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌)ను రైతులు స్వచ్ఛందంగా సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ భూమి కలిగిన యజమానులు, సీసీఆర్‌సీ కార్డులు పొందిన సాగుదారులు పథకాల్లో చేరేందుకు అర్హులని వివరించారు. బ్యాంకుల నుంచి పంట రుణం పొందిన రైతులకు రుణంతో పాటు విజ్ఞప్తి మేరకు బీమా ప్రీమియం కూడా మంజూరు చేయడం జరుగుతుందని, అదేవిధంగా పంట రుణం తీసుకోని రైతులు కామన్‌ సర్వీస్‌ సెంటర్లు (సీఎస్‌సీ), బ్యాంకుల్లో ప్రీమియం చెల్లించి, జాతీయ పంట బీమా పోర్టల్‌ (ఎస్‌సీఐపీ)లో నమోదు చేసుకొని పథకంలో చేరవచ్చని కలెక్టర్‌ లక్ష్మీశ వివరించారు.సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్‌ విజయకుమారి, ఎల్‌డీఎం కె.ప్రియాంక, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, వివిధ బ్యాంకుల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు