Homeజాతీయంసోదరి మరణాన్ని నిరూపించాలని.. అస్థిపంజరంతో బ్యాంకుకు...

సోదరి మరణాన్ని నిరూపించాలని.. అస్థిపంజరంతో బ్యాంకుకు…

- Advertisement -

ఒడిశాలో మానవత్వాన్ని కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన సోదరి ఖాతా నుంచి డబ్బు తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి, ఆమె మరణాన్ని నిరూపించేందుకు సమాధిని తవ్వి అస్థిపంజరాన్ని బ్యాంకుకు తీసుకెళ్లిన ఘటన సంచలనం రేపింది.

దియానాలి గ్రామానికి చెందిన జిటు (50) అనే నిరక్షరాస్యుడు, రెండు నెలల క్రితం మరణించిన తన సోదరి కక్రా ఖాతాలో ఉన్న సుమారు ₹19,300 కుటుంబ అవసరాల కోసం తీసుకోవాలని ప్రయత్నించాడు. అయితే మల్లిపోసి శాఖలోని ఒడిశా గ్రామీణ బ్యాంకు సిబ్బంది మరణ ధృవీకరణ పత్రం లేదా వారసత్వ పత్రాలు లేకుండా డబ్బు ఇవ్వలేమని తెలిపారు. ఖాతాదారు స్వయంగా రావాలని పట్టుబట్టినట్లు సమాచారం.

తాను ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన జిటు, ఏప్రిల్ 27న సోదరి సమాధిని తవ్వి అస్థిపంజరాన్ని తీసుకుని బ్యాంకుకు చేరుకున్నాడు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని జిటుకు నచ్చజెప్పారు. మృతదేహాన్ని మళ్లీ సమాధి చేయించడంతో పాటు అవసరమైన పత్రాల ఏర్పాటులో సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. మానవతా దృష్టితో సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.

ఈ ఘటన గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న అవగాహన లోపం, పేదలకు ఎదురయ్యే ఇబ్బందులను బహిర్గతం చేసింది. అవసరమైన పత్రాలపై అవగాహన లేకపోవడం, అధికారుల కఠిన వైఖరి కారణంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, క్లెయిమ్ చేయని బ్యాంకు ఖాతాల్లో వేల కోట్ల రూపాయలు నిల్వగా ఉన్నాయని, నిబంధనల వల్ల అవి వినియోగంలోకి రాకపోతున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు