హనీమూన్ యాత్రలో విషాదం
హనీమూన్ కోసం సిక్కిం వెళ్లిన ఉత్తరప్రదేశ్ నవ దంపతులు
ప్రమాదంలో డ్రైవర్ మృతి.. లభ్యం కాని మరో 8 మంది పర్యాటకుల ఆచూకీ
గల్లంతైన వారిలో ఒడిశా, త్రిపుర రాష్ట్రాలకు చెందినవారు
12 రోజులుగా కొనసాగుతున్న గాలింపు
ఉత్తరప్రదేశ్కు చెందిన నూతన దంపతుల హనీమూన్ యాత్ర తీవ్ర విషాదంగా ముగిసింది. హనీమూన్ కోసం సిక్కిం వెళ్లిన ఆ జంట అక్కడ జరిగిన ఘోర ప్రమాదంలో గల్లంతైంది. ఈ దుర్ఘటన వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.
పోలీసుల కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాకు చెందిన కౌశలేంద్ర ప్రతాప్సింగ్కు, అంకితా సింగ్ అనే యువతితో మే 5వ తేదీన వివాహం జరిగింది. అనంతరం, వీరు తమ హనీమూన్ కోసం మే 24న సిక్కింకు బయలుదేరారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న వారి ప్రయాణంలో మే 29న ఊహించని ప్రమాదం జరిగింది. వారు పర్యటనలో భాగంగా ప్రయాణిస్తున్న కారుపై అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనం అదుపుతప్పి దాదాపు 1,000 అడుగుల కిందనున్న తీస్తా నదిలో పడిపోయింది. ప్రమాద సమయంలో కారులో నవ దంపతులతో పాటు మరో తొమ్మిది మంది ఉన్నట్లు తెలిసింది. ఈ ఘోర ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. వారి ప్రయత్నంతో ఇద్దరు వ్యక్తులను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. అయితే, కారు డ్రైవర్ మృతి చెందాడు. నవ దంపతులు కౌశలేంద్ర, అంకితతో పాటు మరో ఆరుగురు పర్యాటకుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. గల్లంతైన ఈ ఎనిమిది మంది కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), అగ్నిమాపక శాఖ, అటవీ శాఖకు చెందిన బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం ఎదురవుతోందని అధికారులు వెల్లడించారు. గల్లంతైన ఇతర పర్యాటకుల్లో నలుగురు ఒడిశా రాష్ట్రానికి చెందినవారు కాగా, ఇద్దరు త్రిపుర వాసులుగా గుర్తించారు. ప్రమాదం జరిగి 12 రోజులు గడిచినా తన కుమారుడు, కోడలి ఆచూకీ లభించకపోవడంతో కౌశలేంద్ర తండ్రి షేర్ బహదూర్ సింగ్ కన్నీరుమున్నీరవుతున్నారు. గాలింపు చర్యలను వేగవంతం చేయాలని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను, సిక్కిం ముఖ్యమంత్రిని అభ్యర్థించారు.