నిధులు గోల్ మాల్ అయ్యాయంటున్న గ్రామస్తులు
సభ్యుల మాటకు విలువలేదు కార్యదర్శి దే అంతా
ఆగ్రహించిన సభ్యులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు
ఎమ్మెల్యే స్పందిస్తూ సంబంధిత అధికారులకు ఆజ్ఞలు
విచారణ కమిటీని నియమించిన డివిజనల్ పంచాయతీ అధికారి
విశాలాంధ్ర – తూర్పుగోదావరి : తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వేములూరు గ్రామ సచివాలయం అవినీతికి అడ్డాగా మారిందని నిధులు గోల్మాల్ అయ్యాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు సమర్పిస్తున్నారు. ముఖ్యంగా గ్రామంలో చేసిన పనుల విషయంలో ఎన్నో అవకతవకలు ఉన్నాయని, నిధులు దుర్వినియోగం అయ్యాయని, పంచాయతీ కార్యదర్శి సభ్యులను పక్కదారి పట్టిస్తూ కొంతమంది వ్యక్తులతో చేతులు కలిపి ప్రజా ధనమును దుర్వినియోగం చేశారనే విషయం ఆ గ్రామం అంతా ఇప్పుడు చెప్పుకుంటూ ఆందోళన బాట పట్టారు. సభ్యులు ఏమంటున్నారంటే సమావేశాలు నిర్వహిస్తున్నారు కానీ నిధులకు సంబంధించిన ఊసు మాత్రం సమావేశంలో ఎప్పుడూ చెప్పడం లేదన్నారు. ఇదే విషయమై ఇటీవల జరిగిన సమావేశంలో గట్టిగా కార్యదర్శిని అడిగినా ఏ విధమైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహించిన సభ్యులు సమావేశాన్ని బహిష్కరించి ఎమ్మెల్యే కు ఫిర్యాదు చేశారు. దానికి స్పందించిన శాసనసభ్యులు డివిజనల్ పంచాయతీ అధికారికి సూచిస్తూ తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయగా ఆ అధికారి వెంటనే నోటీసులు జారీ చేసి విచారణ కమిటీని నియమించి వెంటనే విచారణ జరపవలసిందిగా ఆజ్ఞలు జారీ చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇకపోతే తదుపరి విచారణలో అసలు ఏ మేరకు అవినీతి జరిగింది ? ఇందులో కార్యదర్శి పాత్ర ఎంత ? అలాగే ఈ అవినీతి లో ఎవరెవరి ప్రమేయం ఎంతవరకు ఉంది అనేది తెలియాల్సి ఉంది.


