వియత్నాంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మరణించిన ఏపీకి చెందిన ముగ్గురు పర్యాటకుల మృతదేహాలు ఇవాళ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమానాశ్రయానికి వెళ్లి మృతదేహాలను స్వీకరించి, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కడపకు చెందిన ముదియం శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన గెల్లి జయలక్ష్మి, హిందూపురానికి చెందిన రవితేజ పార్థివదేహాలను మొదట వియత్నాం నుంచి ముంబైకి తీసుకొచ్చారు. సోమవారం రాత్రి 9:35 గంటలకు ముంబై ఎయిర్పోర్టుకు చేరుకున్నాక, అక్కడ అవసరమైన అన్ని చట్టపరమైన ప్రక్రియలను వేగంగా పూర్తి చేశారు. అనంతరం మంగళవారం ఉదయం ఇండిగో విమానంలో మృతదేహాలను హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కార్గో టెర్మినల్కు తరలించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బాధిత కుటుంబాలతో మాట్లాడి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పార్థివదేహాలను వారి స్వగ్రామాలకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్సుల ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం, ఏపీ భవన్ అధికారులు సమన్వయంతో మృతదేహాలను స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేశారు. వియత్నాంలోని ఫు క్వోక్ ద్వీపం సమీపంలో శనివారం (జులై 11) ఈ దుర్ఘటన జరిగింది. ఓ ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ తమ డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన విహార యాత్రలో ఈ విషాదం చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న పడవలో మొత్తం 32 మంది ఉండగా, ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మృతురాలు జయలక్ష్మి భర్త గెల్లి కిషోర్ ఈ ప్రమాదంలో గాయపడి, వియత్నాంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. యాత్రకు వెళ్లిన మిగతా తెలుగు పర్యాటకులు ఆదివారం రాత్రికే సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకున్నారు.
వియత్నాం బోటు ప్రమాదం.. హైదరాబాద్ చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- Advertisement -
RELATED ARTICLES


