కొవ్వూరు నియోజకవర్గం లో ఏళ్ళనాటి సమస్యలకు పరిష్కారం..
పుష్కరాల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదనలు అందజేత..
విశాలాంధ్ర – కొవ్వూరు : ఆయన పేరు ముప్పిడి వెంకటేశ్వరరావు.. కొవ్వూరు నియోజకవర్గానికి కొత్త అయినా, పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రక్కన వున్న గోపాలపురం నియోజకవర్గం నుంచి వచ్చి పోటీ చేసినా ఆయనలోని పట్టుదల, ఆత్మవిశ్వాసం ఎక్కడా ఇసుమంతైనా చెక్కు చెదరలేదు. కొవ్వూరు నియోజకవర్గంలోని టిడిపి నాయకులను కలుపుకుని అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి గోపాలపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనుభవాన్ని రంగరించుకుని నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారు. చదువులో ప్రతిభ కనబరిచి న్యాయవాదిగా పట్టా పొందారు. దీంతో ఆయనకు చట్టాలపై ఎంతో అవగాహన ఉంది. మరి వివరాలకు వెళితే.. కొవ్వూరు నియోజకవర్గం నుంచి టిడిపి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలిచి అప్పటి హోం మంత్రి తానేటి వనితపై ఘనవిజయం సాధించారు. అక్కడ నుంచి ఇప్పటివరకు నియోజకవర్గంలో పేరుకుపోయిన ఎన్నో సమస్యలను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. చాలా సమస్యలు పరిష్కారం అయ్యాయి కూడా. వందలాదికోట్లను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించారు. వచ్చే ఏడాది ఏడాది జూలై నెలలో జరగనున్న గోదావరి పుష్కరాలకు తనదైన శైలిలో ప్రణాళికను రూపొందించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదను అందజేశారు. డిపార్ట్మెంట్లు వారీగా ఆయన అందించిన వివరాలను అవలోకనం చేస్తే ఈ విధంగా ఉన్నాయి. పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ద్వారా బిటి, సీసీ రోడ్లు, భవనాల కోసం 41. 58 కోట్లు, దేవాదాయ శాఖ తరపున దేవాలయాల పునర్నిర్మాణ కోసం, రూఫ్, ప్రతిష్ణ మండపం ఎలక్ట్రికల్ ప్రహారీలు కోసం 22 కోట్లు, ఆర్ అండ్ బి శాఖ ద్వారా పలు నిర్మాణాలకు 222.94 కోట్లు, ఆర్డబ్ల్యూఎస్ శాఖ ద్వారా 104.84 కోట్లు, టూరిజం శాఖ ద్వారా కాటేసీలు టూరిజం ఫెసిలిటీలకు 34 కోట్లు నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. అదేవిధంగా కొవ్వూరు మున్సిపాలిటీ ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీగా మార్చాలని ఆ శాఖ మంత్రి నారాయణ కు తన విజ్ఞాపనలు అందజేశారు.
వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి వస్తే.. ఆయన స్పందనే వేరు..
ప్రతివారం శుక్రవారం రోజున క్రమం తప్పకుండా గ్రీవెన్స్ నిర్వహించడమే కాక సంబంధిత అధికారులను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు ఇస్తూ వస్తున్నారు. ఇక సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయానికొస్తే వచ్చిన ప్రజల నుంచి వచ్చిన అప్లికేషన్లను తాను స్వయంగా రాష్ట్ర సచివాలయానికి అందజేసి లబ్ధిదారులకు ఆ చెక్కులను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజలు, టిడిపి నాయకులు, అధికారులు అందిస్తున్న సహాయం మర్చిపోలేనిదని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.


