. ఏపీకి రండి… పెట్టుబడులు పెట్టండి
. అబుదాబి పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సేవలు జనవరి నుంచే అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అమరావతి కొత్త అవకాశాలకు, ఆవిష్కరణలకు కేంద్రంగా ఉంటుందన్నారు. దక్షిణాసియాకు చేరువగా సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం కలిగిఉన్నందున ఏపీలో ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులకు వివరించారు. యూఏఈ పర్యటనలో భాగంగా రెండో రోజు గురువారం అబుదాబీలో అల్ మైరాప్ా ఐలాండ్లోని ఏడీజీఎ స్క్వేర్లో ఏడీఎన్ఓసీ గ్లోబల్ ట్రేడిరగ్ ప్రతినిధి అహ్మద్ బిన్ తలిత్తో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. పెట్రోకెమికల్, ఇంధన, ఎల్ఎన్జీ, గ్యాస్ ప్రాసెసింగ్, పోర్ట్ లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అవకాశాలు గురించి చర్చించారు. కృష్ణపట్నం, మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ వంటి పోర్టుల సమీపంలో పెట్రో కెమికల్, ఎనర్జీ రంగాల పెట్టుబడులకు అనువుగా ఉంటాయని సీఎం అన్నారు. ఏడీఎన్ఓసీ-ఆంధ్రప్రదేశ్ మధ్య సాంకేతిక సహకారం పైనా స్పష్టమైన రోడ్మ్యాప్ సిద్ధం చేయాలని భేటీలో ఇరువురు నిర్ణయించారు. అబుదాబీ చాంబర్ చైర్మన్ అహ్మద్ జాసిమ్ అల్ జాబీతో, జీ 42 సీఈఓ మాన్సూర్ అల్ మాన్సూరీతోనూ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ పయనిస్తోందని, విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని ఈ సందర్భంగా వారిని సీఎం ఆహ్వానించారు. కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్, హెల్త్టెక్ రంగాల్లో నూతన ఆవిష్కరణలపై పనిచేస్తున్న జీ 42 ఇంటర్నేషనల్ సంస్థను ఏఐ డేటా సెంటర్లు, ఇన్నోవేషన్ ల్యాబ్స్, స్మార్ట్ గవర్నెన్స్ టెక్నాలజీని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు స్వాగతించారు.
టెక్ కంపెనీ ప్రతినిధులతో నెట్వర్క్ లంచ్
అనంతరం అబుదాబీలోని పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం నెట్వర్క్ లంచ్ సమావేశంలో పాల్గొంది. దీనిలో జీ 42 సీఈవో మనుకుమార్ జైన్, ఏడీఐసీ గ్లోబల్ హెడ్ లలిత్ అగర్వాల్, ఐహెచ్సీ సీఈవో అజయ్ భాటియా, డబ్ల్యుఐవో బ్యాంక్ సీఈవో జయేష్ పాటిల్, పాలిగాన్ మార్ఫిక్ సీఈవో జయంతి కనాని, ట్రక్కర్ సీఈవో గౌరవ్ బిశ్వాస్, పాలసీ బజార్ గ్రూప్ సీఈవో యశిష్ దహియా, ఇన్స్యూరెన్స్ మార్కెట్ సీఈవో అవినాష్, ఇన్సార్ట్స్ సీఈవో అజార్ ఇక్బాల్, జీఐఐ సీఈవో పంకజ్ గుప్తా, నూన్ సీఈవో ఫరాజ్ ఖలీద్, ఇన్సెప్షన్ సీఈవో ఆశీష్ కోషి పాల్గొన్నారు. రాష్ట్రంలో డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-మెషిన్ లెర్నింగ్, ఫిన్ టెక్, హెల్త్ టెక్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్స్ వంటి రంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను సూచించారు. త్వరలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఏపీలో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను బలోపేతం చేస్తున్నామని చెప్పారు.
ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు
ఫుడ్ ప్రాసెసింగ్, ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారు. అపెక్స్ ఇన్వెస్ట్మెంట్స్, మస్దార్, అగ్తియా గ్రూప్, లులు గ్రూప్ వంటి సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం చంద్రబాబు విడివిడిగా భేటీ అయ్యారు. ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అపెక్స్ ఇన్వెస్టిమెంట్ ఛైర్మన్ ఖలీఫా ఖౌరీ, మస్దార్ సీఈఓ మొహమ్మద్ జమీల్ అల్ రమాహీని ముఖ్యమంత్రి కోరారు. విశాఖలో అతి పెద్ద గూగుల్ డేటా సెంటర్ వస్తున్న నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీపై ఫోకస్ పెట్టామని అపెక్స్, మస్దార్ సంస్థల ప్రతినిధులకు సీఎం వివరించారు. బ్యాటరీ స్టోరేజ్, సూపర్ కెపాసిటర్స్ రంగంలో పేరొందిన అపెక్స్ సంస్థను ఆ రంగంలో పెట్టుబడులు పెట్టాలని సీఎం ఆహ్వానించారు. సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని మస్దార్ సీఈఓను చంద్రబాబు ఆహ్వానించారు. ఇక అగ్తియా గ్రూప్ సీఈఓతో సల్మీన్ అలమేరీ, లులు గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీతో జరిపిన వేర్వేరు భేటీల్లో ఫుడ్ ప్రాసెస్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆ రెండు సంస్థలను సీఎం ఆహ్వానించారు. ఏపీలో కోకో ఉత్పత్తి బాగుంటుందని… తమ దగ్గర చాక్లెట్ పరిశ్రమ పెట్టే అంశంపై ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి అగ్తియా గ్రూప్ కు సూచించారు. ఈ పర్యటనలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్తో పాటు పరిశ్రమలశాఖ, ఈడీబీకి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


