చెన్నై: తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు సీనియర్ నటీమణుల పునరాగమనం నడుస్తోంది. శోభన వంటి నటీమణుల బాటలోనే మాజీ మంత్రి రోజా కూడా మళ్లీ మేకప్ వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ తమిళ సినిమాలకు దూరమైన రోజా… 12 రోజుల తర్వాత ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో తమిళ తంబీలను అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం కోలీవుడ్లో చర్చనీయాంశమైన చిత్రం ‘అన్బే డయానా’. పారి ఎలవళగన్ హీరోగా నటిస్తున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో రోజా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో ఆమె హీరో తల్లిగా నటిస్తున్నారు. పెరంబూర్ నేపథ్యంలో సాగే ఈ కథలో రోజా పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. ఇటీవల విడుదలైన ‘పెరంబూర్ గానా’ పాటలో రోజా తన పాత రోజులను గుర్తు చేస్తూ వేసిన మాస్ స్టెప్పులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డ్యాన్స్లో తన ఎనర్జీని చూపిస్తూ ఫ్యాన్స్ను ఖుషీ చేశారు. ఈ చిత్రం మాత్రమే కాకుండా రోజా నటించిన ‘లెనిన్ పాండ్యన’ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల రాధికా శరత్కుమార్ ‘తాయి కిళవి’ చిత్రంతో మంచి విజయం అందుకోవడంతో, రోజా రీ-ఎంట్రీ సినిమాలపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.


