ఎన్ఏబీఎఫ్ఐడీ నుండి రుణం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాజధాని నిర్మాణానికి రూ.7,500 కోట్ల రుణం అందించేందుకు నేషనల్ బ్యాంకు ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాÛస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్ఏబీఎఫ్ఐడీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో అమరావతి నిర్మాణపనులు మరింత ఊపందుకోనున్నాయి. ఇప్పటికే సుమారు 40వేల కోట్లకు పైగా వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి రుణాలు సేకరించింది. ప్రస్తుతం 64వేల కోట్ల అంచనాలతో కూడిన నిర్మాణపనులకు టెండర్లు పిలిచింది. ఎట్టిపరిస్థితుల్లో మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈనేపథ్యంలో ఆర్థికపరమైన ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు అవకాశమున్న ప్రతి చోటా అప్పులు తెస్తోంది. దీనిలో భాగంగానే తాజాగా ఎన్ఏబీఎఫ్ఐడీ నుండి రూ.7,500 కోట్ల రుణం తీసుకోనుంది. ఈ రుణం మంజూరుకు సంబంధించిన పత్రాలను శుక్రవారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మున్సిపల్ శాఖా మంత్రి డా.పొంగూరు నారాయణ సమక్షంలో రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) కమిషనర్ కె.కన్నబాబు కు బ్యాంకు అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ బ్యాంకు ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాÛస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సామ్యూల్ జోసెఫ్, రుణాలు, ప్రాజెక్టు ఫైనాన్స్ విభాగ వైస్ ప్రెసిడెంట్ కె. దినేశ్ పాల్గొన్నారు.


